సికె బాబు, చింటూ: అనురాధ హత్యపై అన్ని కోణాల్లో, ముగ్గురే ఎందుకు లొంగిపోయారు?
చిత్తూరు: ఏపీలోని చిత్తూరు నగర మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో అన్ని కోణాల్లోను విచారిస్తామని డిజిపి జెవి రాముడు తెలిపారు. వారి రాజకీయ శత్రువులుగా భావిస్తున్న సికె బాబు, ఆస్తి తగాదాల నేపథ్యంలో దగ్గరి బంధువు చింటూ... ఇలా అన్ని కోణాల్లోను దర్యాఫ్తు చేస్తామని చెప్పారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై అంబటి
అనురాధ హత్య వెనుక పొలిటికల్ మోటివేషన్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలకు వైసిపి నేత అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. అధికార పార్టీ ఈ హత్యకు రాజకీయ రంగు పులమాలను చూస్తోందని ఆరోపించారు. తన ఫెయిల్యూర్ కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ రంగు పులుముతున్నారన్నారు.
విచారణను పక్కదోవ పట్టించే ప్రయత్నమా?
మేయర్ అనురాధ, భర్త పైన దాడి జరిగిన గంటల్లోనే ఐదుగురు నిందితుల్లో ముగ్గురు లొంగిపోయారు. దీంతో, విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. లొంగిపోయిన వారి నుండి వివరాలు సేకరిస్తున్నారు. నిందితులు బళ్లారి నుంచి ఆయుధాలు కొనుగోలు చేసినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అనురాధ భౌతికకాయానికి పలువురి నివాళి
కటారి అనురాధ భౌతికకాయాన్ని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ప్రజల సందర్శనార్థం బుధవారం నగర పాలక సంస్థ కార్యాలయానికి తరలించారు. అనురాధ భౌతికకాయానికి తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, పలువురు టిడిపి నేతలు నివాళులర్పించారు.
అనురాధ మృతిని సహచరులు, కార్యకర్తలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, అనురాధ గత ఏడాది (2014) జూలై 3వ తేదీన మేయర్గా ఎన్నికయ్యారు. పదహారు నెలల పాటు మేయర్గా చేశారు.