టీడీపీ ఆఫీసు దాడి కేసు, సీఐడీ కస్టడీలో నిందితుడు, వైసీపీ లీడర్స్ !!
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఏ1 నిందితుడు పానుగంటి చైతన్య అలియాస్ చైతన్యను ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో చైతన్య ప్రత్యక్షంగా పాల్గొన్నాడని అధికారులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో అసలు సూత్రధారులు ఎవరు అనే విషయం బయటకు లాగడానికి ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు చైతన్యను విచారణ చేస్తున్నారు.
చైతన్య వెనుక ఉండి నడిపించింది ఎవరు, ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరు అని ఆరా తీస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఏ1 నిందితుడైన చైతన్య చాలా కాలం పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని అనేక రాష్ట్రాలలో తిరిగాడు. చైతన్యను కొందరు వైసీపీ నాయకులు తప్పించారని ఆరోపణలు ఉన్నాయి. చివరికి మంగళగిరి పోలీసులు పానుగంటి చైతన్యను పట్టుకున్నారు.

మంగళగిరి గ్రామీణ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ చేశారు. పానుగంటి చైతన్య గుంటూరు జిల్లా జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. కేసు విచారణ ప్రారంభించిన సీఐడీ అధికారులు మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కేసు దర్యాప్తు వివరాలు ఉన్న ఫైల్ స్వాధీనం చేసుకున్నారు.

కేసు విచారణలో భాగంగా చైతన్యను విచారణ చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. చైతన్యను విచారణ చేయడానికి కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజులపాటు చైతన్యను విచారణ చేయడానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో గుంటూరు జిల్లా జైలులో ఉన్న చైతన్యను శుక్రవారం సాయంత్రం సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరులోనే సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో చైతన్యను విచారణ చేస్తున్నారు. సీఐడీ అధికారుల విచారణలో చైతన్య ఎవరెవరి పేర్లు బయటపెడుతాడో అని కొంత మంది వైసీపీ నాయకులు హడలిపోతున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications