ఏపీకి వచ్చిన సుప్రీంకోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్..!!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఇవ్వాళ ఏపీకి వచ్చారు. భార్య కల్పన దాస్ తో కలిసి శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు.
నంద్యాల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. రాష్ట్ర పర్యటనకు వచ్చారు. గత ఏడాది ఆయన ఏపీలో మూడు రోజుల పాటు పర్యటించారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీని ఆయన ప్రారంభించారు. అప్పట్లో ఆయన తన పర్యటనను తిరుమలతో శ్రీకారం చుట్టారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇవ్వాళ ఆయన మరోసారి ఏపీకి వచ్చారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. డీవై చంద్రచూడ్, ఆయన భార్య కల్పన దాస్ శనివారం సాయంత్రమే శ్రీశైలానికి వచ్చారు. ఆయన వెంట సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ దంపతులు ఉన్నారు.

మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ఏపీ-తెలంగాణ రిజిస్ట్రార్ జనరల్స్ వై లక్ష్మణ రావు, కే సుజన, దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్, కర్నూలు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ శ్రీనివాస రావు, నంద్యాల జిల్లా కలెక్టర్ మన్జీర్ జిలాని సమూన్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రఘువీర్ రెడ్డి, శ్రీశైలం పాలక మండలి ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్ లావణ్న ఆయనకు సాదర స్వాగతం పలికారు.

శనివారం రాత్రి ఆయన శ్రీశైలం దేవస్థానం అతిథిగృహంలో బస చేశారు. ఇవ్వాళ చంద్రచూడ్ దంపతులు భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. లింగాభిషేకం చేశారు. ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.












Click it and Unblock the Notifications