తిరుపతి: వెంకటరమణ, భూమన డిష్యూం డిష్యూం
తిరుపతి: తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకటరమణపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకటరమణ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బుధవారం గురుకృపా విద్యామందిర్ పోలింగ్ బూత్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
కరుణకరరెడ్డి ఓటమి భయంతో అరాచకాలు సృష్టించడానికి కడప నుంచి రెండువేల మంది గుండాలను తెప్పించారని, బుధవారం సాయంత్రం 5-45 గంటలకు భూమనతోపాటు ఆయన గుండాలు గురుకృపా విద్యామందిర్ పోలింగ్ బూత్లోకి ప్రవేశించారని, దీనిని అడ్డుకునేందుకు లోపలకు వెళ్లిన వెంకటరమణ అడ్డుకునే ప్రయత్నం చేయగా భూమన దాడి చేశారని, దీంతో వెంకటరమణ కింద పడిపోయారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.
పోలింగ్ అధికారి సమాచారం మేరకు అక్కడకు వచ్చిన పోలీసులు భూమన, వెంకటరమణ ఇద్దరినీ అర్బన్ ఎస్పీ కార్యాలయానికి తరలించారు. దీనిని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు వ్యతిరేకించారు. భూమనపై కేసు పెట్టకుండా ఇద్దరినీ ఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్లడమేమిటని వారు ప్రశ్నించారు.
పోలీసులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని వారు ఆరోపించారు. ఎస్పీ రావాలంటూ పోలింగ్ బూత్ దగ్గర పోలీస్ వాహనాల ఎదుట టిడిపి కార్యకర్తలు బైఠాయించారు. కాగా ఇద్దరు అభ్యర్థుల మధ్య అధికారులు రాజీ ప్రయత్నాలు నడిచాయి.