వాలంటీర్ల వ్యవస్థ ప్రక్షాళన, ఇక ఇలా - చంద్రబాబు కీలక నిర్ణయం..!!
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ప్రక్షాళన దిశగా సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని గతంలోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. వారికిచ్చే వేతనం రూ 10 వేలకు పెంచుతామని చెప్పారు. గత రెండు నెలలుగా వాలంటీర్ల కొనసాగింపు పైన డైలమా కొనసాగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్ల సేవకు న్యూ లుక్ తేవాలని భావిస్తున్నారు. ఆ దిశగా కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్దమవుతున్నారు.
వాలంటీర్ల కొనసాగింపు
వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ పథకాల అందించేందుకు వాలంటీర్ల సేవలను గత ప్రభుత్వం వినియోగించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల సేవలను వినియోగించుకోవటం పైన ఇప్పుడు కసరత్తు మొదలు పెట్టింది. వాలంటీర్లు లేకుండానే సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి వద్దనే ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేసింది. ఇప్పుడు వాలంటీర్ల సేవలను సమర్ధవంతంగా ఏ విధంగా వియోగించుకోవాలనేది ఆలోచన ప్రారంభించింది.

స్కిల్ శిక్షణ ద్వారా
రాష్ట్ర వ్యాప్తంగా సర్వీసులో ఉన్న వాలంటీర్ల కెపాసిటీ పెంచేలా వారికి స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. వాలంటీర్ల విద్యార్హత, వయసు ఆధారంగా వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి.. ఏ కార్యక్రమాల కు వారి సేవలు వినియోగించుకోవాలనేది అధ్యయనం చేస్తోంది. వాలంటీర్లలో పీజీ చేసిన వారు 5 శాతం ఉండగా.. డిగ్రీ చేసిన వారు 32 శాతం ఉన్నారు. 20 -25 మధ్య వయసు ఉన్నవారు 25 శఆతం, 25-30 మద్య వయసు ఉన్నవారు 34 శాతం, 31-35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 28 శాతం మంది ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మంత్రివర్గంలో నిర్ణయం
ఆసక్తి ఉన్న వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి స్కిల్ నైపుణ్యం పెంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. వీరి ద్వారానే ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. పరిమిత సంఖ్యలోనే... పరిమిత కాలం వరకు వీరి సేవలను కొనసాగించేలా ఈ నెల 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,53,908 మంది వాలంటీర్లు ఉన్నారు. ఎన్నికల సమయంలో 1,09,192 మంది వాలంటీర్లు రాజీనామా చేసారు. ప్రస్తుతం ఉన్న వాలంటీర్లకు నెలకు రూ 10 వేలు చొప్పున వేతనం చెల్లిస్తే రూ 1848 కోట్లు అవసరం. దీంతో, వాలంటీర్ల కొనసాగింపు..వారి విధుల పైన ఈ నెల 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications