రేపటి నుంచి టీడీపీ ప్రిస్టేజియస్ ప్రోగ్రామ్- చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. రెండేళ్ల పాలన విజయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. 2024 జూన్ లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడానికి ప్రాధాన్యత ఇస్తోంది.
ఈ క్రమంలో.. 45 రోజుల పాటు ఇంటింటి ప్రచార కార్యక్రమానికి రూపకల్పన చేసింది టీడీపీ. సోమవారం ఈ కార్యక్రమానం ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పార్టీ ముఖ్య నేతలు, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. రెండేళ్ల పాలన స్థితిగతుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారాయన.

2024 ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించామని, దీన్ని నిలబెట్టుకోవాల్సి అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ఇచ్చిన హామీల వల్ల 57 శాతం ఓట్లను సాధించగలిగామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగించిందని, 151 స్థానాల నుంచి 11 సీట్లకు పడిపోయిందని వ్యాఖ్యానించారు. నాటి ప్రభుత్వంపై వ్యతిరేకతతో ప్రజలు కూటమికి ఘన విజయాన్ని అందించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజారంజకంగా పాలన సాగిస్తోందని, ప్రతి విషయంలో కూడా వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 94 శాతానికి పైగా స్ట్రైక్ రేట్ ను సాధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్థానిక సంస్థలను క్లీన్ స్వీప్ చేయాలని సూచించారు. టీడీపీతో పాటు కూటమి పార్టీల అభ్యర్థులందరి విజయానికీ ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని అన్నారు.
పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలని, ఎన్నికల సమయంలో ఇంటింటికీ వెళ్లి హామీలు వివరించినట్లే, ఇప్పుడు కూడా ప్రభుత్వం వాటిని ఎలా అమలు చేస్తోందో ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఇలా పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లి కూటమి ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించాలని చెప్పారు.
తాము మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాను చంద్రబాబు ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. అలాగని నిర్లక్ష్యంగా ఉండకూడదని హితవు పలికారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతగా పని చేస్తోన్నామనే విషయాన్ని ప్రజలందరికీ అర్థం అయ్యేలా వివరించాలని, ప్రత్యేకించి మహిళలు, యువత, విద్యార్థులు, రైతల సంక్షేమం కోసం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాలను ఇంటింటికీ వివరించాలని చెప్పారు. గత ప్రభుత్వ వైఫల్యాలను కూడా గుర్తు చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications