సీట్ల ఖరారులో సీఎం జగన్ మార్క్ డెసిషన్స్ - సిట్టింగుల్లో వారికి నో ఛాన్స్..!!
వై నాట్ 175. ఇదే నినాదంతో సీఎం జగన్ ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ప్రతిపక్షాలు పొత్తులతో తనను ఓడించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు కౌంటర్ వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా అభ్యర్దుల ఎంపిక విషయంలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్దుల జాబితా పై కసరత్తు జరుగుతోంది. దసరా సమయంలో అభ్యర్దుల తొలి జాబితా ప్రకటిచేందుకు సిద్దం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అభ్యర్దుల ఎంపికపై కసరత్తు : అధికారం నిలబెట్టుకోవాలనేది ముఖ్యమంత్రి జగన్ టార్గెట్. ఇందుకోసం 2019 లో అధికారంలోకి వచ్చిన సమయం నుంచి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. తాను అమలు చేస్తున్న సంక్షేమం తిరిగి తనకు అధికారం దక్కేలా చేస్తుందనేది సీఎం విశ్వాసం. తాను మంచి చేసానని నమ్మితేనే తనకు అండగా నిలవాలని జగన్ పిలుపునిస్తున్నారు.

ఇదే సమయంలో రాజకీయంగానూ వ్యూహాలకు పదును పెడుతున్నారు. 2019 ఎన్నికల్లో అమలు చేసి సక్సెస్ అయిన సోషల్ ఇంజనీరింగ్ ను ఈ సారి మరింత పక్కాగా అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అభ్యర్ధుల ఎంపిక పైన ఏడు దశల్లో సర్వేలు చేయిస్తున్నారు. సర్వేల్లో వెనుకబడిన ఎమ్మెల్యేలను పని తీరు మెరుగుపర్చుకోవాలని పదే పదే హెచ్చరిస్తున్నారు. అభ్యర్దుల ఎంపిక సమయానికి కూడా మెరుగుపడకపోతే వారిని మార్చక తప్పదని స్పష్టం చేస్తున్నారు.
గెలుపే ప్రామాణికంగా : ఇప్పుడు వైసీపీ నుంచి 151 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ, జనసేన నుంచి వైసీపీకి దగ్గరైన వారికి సీట్లు కేటాయించాల్సి ఉంది. అందులో వల్లభనేని వంశీ, కరణం బలరాం కుమారుడికి ఇప్పటికే సీట్లు ఖరారు చేసారు. వైసీపీ నుంచి టెక్కలి, అద్దంకి, కుప్పం, మండపేట, విజయవాడ తూర్పు, రాజమండ్రి అర్బన్ వంటి టీడీపీ ప్రాతినిధ్య నియోజకవర్గాలకు అభ్యర్దులను ప్రకటించారు.
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తిరిగి ఎంతమందికి సీట్లు దక్కుతాయనేది ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది. ప్రస్తుతం ఉన్న వారిలో 20 శాతం మినహా అందిరికీ సీట్లు ఖాయమని విశ్వసనీయ సమాచారం. నలుగురు ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వంగా గీత, చింతా అనూరాధ, మార్గాని భరత ను అసెంబ్లీ బరిలో దింపుతారని తెలుస్తోంది.

సీనియర్లకు ఎన్నికల బాధ్యతలు : ఎమ్మెల్యేల పని తీరు పైన ఐ ప్యాక్ తో పాటుగా మరో ఆరు సంస్థల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. మొత్తం 151 మంది ఎమ్మెల్యేల్లో 36 మందికి సీట్లు దక్కే అవకాశం లేదని విశ్వసనీయ సమాచారం.అదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తులో ఏ పార్టీ ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు.. ఎవరిని బరిలో దింపే అవకాశం ఉంది..అక్కడి సామాజిక సమీకరణాలు.. వైసీపీకి పక్కాగా ఉన్న ఓట్ బ్యాంక్ వంటికి పరిగణలోకి తీసుకొని అంచనాలకు భిన్నంగా ఈ సారి అభ్యర్దుల ఎంపిక ఉంటుందని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు.
సీనియర్లలోని కొందరిని పోటీ నుంచి తప్పించి ఎలక్షన్ మేనేజ్ మెంట్ కు వినియోగిస్తున్నారు. సీట్లు దక్కని వారిని ముందుగానే బుజ్జగించి ఇతర అవకాశాలపైన హామీ ఇస్తున్నారు. ముందుగానే అభ్యర్దుల ఖరారు ద్వారా ప్రజలతో ఎక్కవగా మమేకం అవ్వటానికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications