ఏపీ శాసన మండలి రద్దు..! కాసేపట్లో శాసనసభలో తీర్మానం: సీఎం జగన్ నిర్ణయం..!
మండలిలో తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపటం పైన ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఉన్నారు. దీనికి తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. ఇప్పటి కే ఇదే అంశం మీద న్యాయ నిపుణులు ముఖుల్ రోహిత్గీతో సీఎం చర్చించారు. ఇక, ఒక వైపు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మంత్రులు..సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు.
అందులో మండలి రద్దు అంశం పైన చర్చలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం దిశగా ప్రతిపాదన చేసారు.. దీని పైన మంత్రుల అభిప్రాయాలను సీఎం సేకరిస్తున్నట్లు సమాచారం. కొందరు మంత్రులు ఏకీభవిస్తున్నా..మరి కొందరు మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వానికి మండలిలో విలువ లేకుండా చేసారనే భావనతో ఉండటంతో..మండలి రద్దు దిశగా శాసనసభ లో కాసేపట్లో తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం..
ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలోనే మండలి రద్దు తీర్మానం చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా మంత్రులు..సీనియర్ నేతలకు సీఎం తన నిర్ణయం ఏంటో స్పష్టం చేసారు. దీని పైన మంత్రులు ముఖ్యమంత్రిని వారించే ప్రయత్నం చేసారు.
రానున్న రోజుల్లో మండలిలో వైసీపీకే ఆధిక్యం వస్తుందని ..ఇప్పుడు చేస్తే రాజకీయ కక్ష్యతో చేసినట్లు అవుతుందని ..అందులోనూ కొన్ని న్యాయ పరమైన సమస్యలు ఉన్నాయని చర్చకు వచ్చినట్లుగా సమాచారం. అదే సమయంలో ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా ..అమలుకు సమయం పడుతుందని..దీని వలన ప్రయోజనం ఏంటనే కోణంలోనూ చర్చ సాగుతోంది. అయితే, సీఎం మాత్రం మండలి విషయంలో కీలక నిర్ణయం దిశగానే ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీని పైన ఈ రోజే తీర్మానానికి రంగం సిద్దం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రద్దు చేస్తే ఫలితం ఏముంటుంది...
ప్రభుత్వ బిల్లులకు విలువ ఇవ్వకుండా.. పార్టీ అభిప్రాయం మేరకు మండలిలో ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠాత్మకం గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. కొద్ది సేపటి క్రితం ముఖుల్ రోహిత్గీతో సమావేశమైన ముఖ్యమంత్రి..శాసనమండలి రద్దు చేయటం పైన అభిప్రాయం తీసుకున్నట్లుగా సమాచారం.
అది ప్రభుత్వంలో చర్చించి నిర్ణయానికి రావాలని..నిర్ణయం తీసుకున్నా తక్షణమే అమలయ్య అవకాశం ఉండని విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే, మండలిలో ప్రస్తుతం టీడీపీ మెజార్టీ ఉండటం.. మరో రెండేళ్ల వరకు టీడీపీ అనుకున్న విధంగానే మండలి నడిచే అవకాశం ఉండటంతో..ఆ పరిస్థితి కొనసాగటానికి వీళ్లేదంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ రోజు సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని..కేంద్రం నిబంధనల మేరకు వ్యవహరించినా తమకు అభ్యంతరం లేదని సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఆరు నెలల నుండి ఏడాది కాలం..
ఈ రోజు శాసనసభలో మండలి రద్దు తీర్మానం చేసి..కేంద్రానికి పంపాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు నిర్ణయం తీసుకున్నా కేంద్రం వెంటనే ఆమోద ముద్ర వేసే అవకాశం లేదు. దీని పైన పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత మాత్రమే రద్దు నిర్ణయం అమల్లోకి రానుంది. అదే జరిగితే ప్రస్తుతం మండలిలో వైసీపీ నుండి ఇద్దరు ఎమ్మెల్సీలుగా కొనసాగుతూ మంత్రుల య్యారు.
అదే విధంగా మరో ఏడుగురు పార్టీ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఇక, రాజకీయంగా ఎలా ఉన్నా..నేరుగా పట్టభద్రులు..ఉపాధ్యాయుల ద్వారా సభకు ఎన్నికైన వారు ఈ నిర్ణయం పైన న్యాయ పోరాటానికి అవకాశం ఉందని చెబుతున్నారు. టీడీపీ మాత్రం రద్దు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని..అది ఏడాది ప్రక్రియ అని ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో..ముఖ్యమంత్రి సభలో చేసే ప్రకటన ఇప్పుడు కీలకంగా మారనుంది.