మరోసారి చెబుతున్నా, ఎవరూ మిస్ కాకూడదు - సీఎం జగన్..!!
ప్రతి అడుగులోనూ మానవత్వమే ప్రదర్శించామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఎవరూ మిస్ కాకూడదని స్పష్టం చేసారు. నష్టం జరిగే పరిస్థితి ఏ ఒక్కరికీ ఉండకూడదని తపన, తాపత్రయం ప్రభుత్వ ప్రతి అడుగులోనూ కనిపిస్తోందంటూ సీఎం జగన్ పేర్కొన్నారు. వధువుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో వైయస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా సాయం జమ చేశారు. ఆడపిల్లల కోసం వారి తల్లిదండ్రులకు తోడుగా నిలబడుతూ ఈ పథకాలు తెచ్చామని చెప్పారు.
ఈఏడాది ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికానికి సంబంధించి వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్లను సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. ఆడపిల్లలు గొప్పగా చదివేలా వారి చదువులను ప్రోత్సహిస్తూ.. ఆ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే మంచి కార్యక్రమంగా పేర్కొన్నారు. పిల్లలు బాగా చదవాలని, ప్రతి ఒక్కరూ డిగ్రీ వరకు వెళ్లే పరిస్థితికి రావాలనే తలంపుతో ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో పెళ్లీళ్లు చేసుకున్న అర్హులకు, 2023 జనవరి నుంచి మార్చి వరకు వివాహాలై వారిలో కూడా ఏ కారణం చేతైనా పథకం అందనివారు ఎవరైనా ఉంటే వారిని కూడా దీంట్లో కలిపి వీరందరికీ ఈరోజు సాయం చేస్తున్నామని వివరించారు.

ఇలా మొత్తంగా 18,883 జంటలకు సంబంధించి రూ.141 కోట్ల ఆర్థిక సాయం నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం జరుగుతుందని సీఎం వెల్లడించారు. ఈ పథకం ద్వారా గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రెండు విడతల్లో ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేశామన్నారు. ఈరోజు మూడో విడత సాయం అందిస్తున్నామని చెప్పారు. నేటితో కలుపుకుంటే అక్షరాల రూ.267 కోట్లు ఆడపిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని అమలు చేసినట్టుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 35,551 మంది జంటలకు మేలు జరుగుతుందని వెల్లడించారు. ప్రతి ఏడాది నాలుగు విడతల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని..ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం అమలవుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధన వల్ల ప్రతి ఒక్కరూ డిగ్రీ వరకు చదివే పరిస్థితి రావాలి, పేదరికం నుంచి బయటపడాలంటే కచ్చితంగా చదువు అనే బ్రహ్మాస్త్రం ప్రతి ఒక్కరూ చేతిలో ఉండాలని ప్రభుత్వం పడుతున్న ఆరాటానికి ఇదొక నిదర్శనంగా సీఎం చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతీది చేశామంటే చేశామనే పరిస్థితి తప్ప.. చిత్తశుద్ధితో చేయాలని, పేదలకు మంచి జరగాలనే ఆలోచన ఏరోజూ జరగలేదన్నారు. పొరపాటున ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కచ్చితంగా మరో త్రైమాసికంలో జతచేసి సాయం అందించే కార్యక్రమం చేస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications