పొత్తుల వేళ కొత్త రాజకీయం - ఢిల్లీకి సీఎం జగన్, ఏం జరుగుతోంది..!!
ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ తమతో కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ మాత్రం తమ వైఖరి స్పష్టం చేయటం లేదు. చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. ఆ వెంటనే ప్రధానితో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఇక, ఇప్పుడు మరోసారి సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో, రాజకీయంగా ఈ టూర్ పైన ఆసక్తి పెరుగుతోంది.
కొత్త సమీకరణాలు:ఏపీలో ఎన్నికల రాజకీయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన తమ అభ్యర్దుల తొలి జాబితా ప్రకటించారు. కొందరు సీనియర్లకు సీట్లు దక్కలేదు. టికెట్లు ఇవ్వని వారితో చంద్రబాబు, పవన్ బుజ్జగింపులు కొనసాగిస్తున్నారు. టీడీపీ 94 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసారు. జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు ఖరారయ్యాయి. బీజేపీతో పొత్తు ఖాయమైన తరువాత మిగిలిన సీట్ల పైన నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు - పవన్ స్పష్టం చేసారు. ఈ సమయంలో బీజేపీ ఆలోచన ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఈ నెల 27న బీజేపీ ఏలూరులో సభ నిర్వహిస్తోంది. వరుసగా బీజేపీ ముఖ్య నేతలు ఏపీలో పర్యటించనున్నారు. ఇక, ఈ నెలఖారులోగా పొత్తు పైన క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.

జగన్ ఢిల్లీ పర్యటన:ఇదే సమయంలో సీఎం జగన్ మరోసారి ఢిల్లీ పర్యటన ఆసక్తిని పెంచుతోంది. ప్రధాని మోదీతో పాటుగా ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ పర్యటన అధికారిక టూర్ గా అధికారులు చెబుతున్నారు. గత పర్యటన సమయంలో పోలవరం కు అడహక్ నిధులు.. రాష్ట్రానికి సంబంధించిన అంశాల పైన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. మార్చి 3న కేంద్ర ప్రభుత్వ కేబినెట్ భేటీ జరగనుంది. మరో పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుండటంతో ఈ సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పోలవరం నిధులకు గతంలోనే జలశక్తి ఆమోద ముద్ర వేసి ఆర్దిక శాఖకు సిఫార్సు చేసింది. దీని పైన నిర్ణయం తీసుకోవాలని ప్రత్యేకంగా సీఎం జగన్ కోరనునున్నట్లు తెలుస్తోంది.
పొత్తుల వేళ ఆసక్తి:చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత పవన్ బీజేపీ ముఖ్యులతో సమావేశం అవుతారని ప్రచారం సాగింది. కానీ, ఇప్పటి వరకు భేటీ జరగలేదు. సీట్ల గురించి అనేక ప్రతిపాదనలు చర్చకు రాగా..అధికారికంగా నిర్ణయం జరగలేదు. ఢిల్లీ నుంచి పిలుపు కోసం పవన్ వేచి చూస్తున్నారు. ఈ సమయంలోనే జగన్ మరోసారి ఢిల్లీ పర్యటన వెళ్లనుండటం ఏపీలో ఎన్నికలు..పొత్తుల వేళ ఆసక్తిని పెంచుతోంది. సీఎం జగన్ పలు సభల్లో టీడీపీకి రెండు జాతీయ పార్టీల్లో ఒకటి ప్రత్యక్షంగా..మరొకటి పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్నాయని చెప్పుకొచ్చారు. కానీ, రాజకీయంగా మాత్రం చర్చలు మరో విధంగా ఉన్నాయి. దీంతో, ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటన పైన రాజకీయంగా ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications