ఎన్నికల వేళ.. మాట ఇచ్చిన వైఎస్ జగన్
YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు. ఇన్పుట్ సబ్సిడీగా 1,294.58 కోట్ల రూపాయల పంట నష్టపరిహారం- రాయితీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లల్లో జమ చేశారు. 11.59 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మొత్తం అందింది.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నారు. ఖరీఫ్ వర్షాభావ పరిస్థితులు, మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోగా నష్ట పరిహారాన్ని విడుదల చేశామని అన్నారు. రైతులకు నష్టం జరిగితే ఇకపై ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన, క్రమం తప్పకుండా, పారదర్శకంగా నిధులను విడుదల చేసేలా బాటలు వేశామని చెప్పారు.

ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడూ లేవని, మొట్టమొదటి సారిగా వాటిని మార్చేశామని జగన్ అన్నారు. గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి వచ్చిన తరువాత పంట నష్టపరిహారాన్ని అంచనా వేయడం వేగవంతమైందని అన్నారు. ప్రతి రైతుకూ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు.
పంట వేసిన వెంటనే ఈ-క్రాప్ నమోదు చేస్తోన్నామని, దీనివల్ల పూర్తి డేటా అందుబాటులోకి వస్తోందని చెప్పారు. వరదలు, ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ పంట నష్టం జరిగినా అత్యంత పారదర్శకంగా జాబితాను రూపొందిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. సచివాలయ పరిధిలో జాబితాలను రూపొందించే వెసులుబాటు కూడా తెచ్చామని గుర్తు చేశారు.
మిచాంగ్ తుఫాన్ వల్ల రంగుమారిన, తడిచిన 3 లక్షల టన్నులు ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసిందని జగన్ అన్నారు. గత ఏడాది ఖరీఫ్లో వర్షాభావం, రబీలో వచ్చిన మిచాంగ్ తుపాన్లో నష్టపోయిన 11.60 లక్షల మంది రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీని విడుదల చేశామని చెప్పారు.
తమ ప్రభుత్వ హయాంలో వర్షాలు సకాలంలో పడుతున్నాయని, కరువు మండలాలు ప్రకటించాల్సిన అవసరం రాలేదని జగన్ చెప్పారు. ఈ నాలుగేళ్లలో సమృద్ధిగా వర్షాలు కురిశాయని, గత ఏడాది మాత్రం కొంత వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనాల్సి వచ్చిందని అన్నారు. ఏడు కరవు మండలాలను ప్రకటించామని అన్నారు.












Click it and Unblock the Notifications