ముంబైకి పవన్ కల్యాణ్, సర్జరీ - పార్టీ నేతలకు దిశా నిర్దేశం..!!
డిప్యూటీ సీఎం పవన్ కు సర్జరీ జరగనుంది. గత వారం ముంబాయిలో వైద్య పరీక్షల తరువాత సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారు. దీంతో, ముంబాయిలో సర్జరీకి పవన్ సిద్దం అయ్యారు. దీనికి ముందుగా పార్టీ నేతలతో పవన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కీలక దిశా నిర్దేశం చేసారు. అయిదు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ రోజు కేబినెట్ సమావేశానికి పవన్ దూరంగా ఉన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ ముంబాయిలో సర్జరీ చేయించుకుంటున్నారు. పవన్ గతంలో తన సినిమాల షూటింగ్.. రాజకీయ పర్యటనల సమయంలో భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పట్లో తాత్కాలిక చికిత్సలతో ఉపశమనం పొందినప్పటికీ, ఇటీవల ఎన్నికల ప్రచారంతో పాటుగా రెండేళ్ల కాలంగా నిరంతర పర్యటనల వల్ల ఏర్పడిన శారీరక శ్రమ కారణంగా ఆ పాత గాయం మళ్లీ తిరగబెట్టింది.

గత కొన్ని రోజులుగా నొప్పి మరింత తీవ్రం కావడంతో, ఆయన వైద్యుల సలహా మేరకు ముంబైలోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో ఈ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ముంబాయి ఆస్పత్రిలో ఏర్పాట్లు చేసారు. సర్జరీ అనంతరం పవన్ కళ్యాణ్ కనీసం కొన్ని వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు. పార్టీ నేతలతో భేటీ సమయంలోనూ ఈ విషయాన్ని పవన్ స్పష్టం చేసారు.
సర్జరీ తరువాత విశ్రాంతి
వైద్యుల సూచన మేరకు కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో ఆపరేషన్కు అన్ని ఏర్పాట్లు చేసారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి ముంబైలోని ఆస్పత్రికి చేరుకోనున్నారు. గతవారం ఇదే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న పవన్కు రొటేటర్ కఫ్తో పాటు రెండు భుజాల కండరాలకు గాయాలున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ తరువాత ఆరోగ్య పరిస్థితిని బట్టి తిరిగి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
తాజాగా జరిగిన పార్టీ నేతల భేటీలో కమిటీల ఏర్పాటు.. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి పైన పవన్ సమీక్షించారు. ఎన్నికలకు ముందు.. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన తరువాత నెలకున్న పరిణామాల పైన పవన్ అడిగి తెలుసుకున్నారు. కమిటీ ఏర్పాటు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని నిర్దేశించారు.












Click it and Unblock the Notifications