ఎల్లుండే..: తెలుగుదేశం నేతల్లో కొత్త టెన్షన్..!!
చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్లుండి ఆయన కుప్పం గడ్డపై అడుగు పెట్టబోతోన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద మూడో విడతగా నిధులను విడుదల చేయనున్నారు. బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత కుప్పం పర్యటించబోతోండటం ఇదే తొలిసారి.
ఏర్పాట్లు పూర్తి..
కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ పర్యటనను విజయవంతం చేయడానికి సన్నాహాలు పూర్తి చేశారు. తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఈ నియోజకవర్గం కావడం, ఈ స్థానం పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తిరుగులేని విజయాన్ని అందుకున్న నేపథ్యంలో జగన్ పర్యటనకు రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కుప్పంలో కోలాహలం..
వైఎస్ జగన్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని పలువురు మంత్రులు కుప్పంలో మోహరించారు. జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇప్పటికే పలుమార్లు పర్యటించారు. చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన మంత్రులు ఆర్ కే రోజా, ఉష శ్రీచరణ్ కూడా కుప్పంలో పర్యటించారు. ఎంపీ రెడ్డెప్ప సహా పలువురు ఎమ్మెల్యేలు కుప్పంలో మోహరించారు. జగన్ వెంట వాళ్లు మళ్లీ కుప్పానికి బయలుదేరి వెళ్లనున్నారు. మంత్రుల రాకపోకలు, జగన్ స్వాగత బ్యానర్లతో కుప్పంలో రాజకీయ కోలాహలం నెలకొంది.
క్లీన్ స్వీప్..
కుప్పం నియోజకవర్గం అభివృద్ధిపై వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనికి అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటోన్నారు. వాటిని తక్షణమే కార్యాచరణలోకి తీసుకొస్తోన్నారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 66 కోట్ల రూపాయలను ప్రత్యేక నిధులను ప్రభుత్వం విడుదల చేశారు. ఇక కుప్పం పర్యటనకూ వైఎస్ జగన్ పూనుకున్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా క్లీన్ స్వీప్ చేయాలనేది వైఎస్ జగన్ లక్ష్యం.
షెడ్యూల్ ఇదే..
జగన్ కుప్పం పర్యటన షెడ్యూల్ వెలువడింది. ఎల్లుండి ఉదయం 9:15 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్తారు. 10:45 నిమిషాలకు కుప్పానికి చేరుకుంటారు. ఆ తరువాత ఉదయం 11:15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చేయూత పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేస్తారు. మళ్లీ 3:10 నిమిషాలకు తాడేపల్లికి చేరుకుంటారు.