ఈ రెండు పథకాల కింద నిధులు విడుదల చేసిన వైఎస్ జగన్
YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాల కింద నిధులను విడుదల చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బటన్ నొక్కి- ఆయా నిధులను లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు.
వరుసగా అయిదో సంవత్సరం, ఈ ఏడాది మూడో విడతగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఒక్కొక్కరికి 2,000 చొప్పున 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,078.36 కోట్ల రూపాయలను జమ చేశారు. వరుసగా నాలుగో ఏడాది సున్నా వడ్డీ పంట రుణాల కింద 10,78,615 మంది రైతులకు 215.98 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ సొమ్మును విడుదల చేశారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. ఇప్పటివరకు రైతు భరోసా కింద 34,288 కోట్ల రూపాయలను చెల్లించామని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో పేరుకుపోయిన బకాయిలను తామే చెల్లించామని చెప్పారు. పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలను చెల్లిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తోన్నామని, పెట్టుబడి సాయాన్ని సైతం పెంచామని అన్నారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ కంటే కూడా ఒక్కో రైతన్నకు అదనంగా రూ.17,500 ఇస్తున్నామని వైఎస్ జగన్ వివరించారు. రైతులు, రైతు కూలీలు బాగుండాలనేదే తమ ఉద్దేశమని, అందుకే- క్రమం తప్పకుండా రైతు భరోసా కింద సహాయాన్ని అందించామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సుమారు 50 శాతం లోపు రైతులకు ఉన్న భూమి అర హెక్టారు లోపేనని ఆయన గుర్తు చేశారు. అలాగే అర హెక్టారు నుంచి హెక్టారు వరకు భూములు ఉన్న రైతులు 70 శాతం మంది ఉన్నారని, పెట్టుబడి సహాయం కింద విడుదల చేసిన నిధులు వారికి ఎంతో మేలు చేసిందని జగన్ అన్నారు.

సున్నా వడ్డీ కింద కూడా 215.98 కోట్ల రూపాయలను విడుదల చేశామని, రుణాలు తీసుకుని క్రమం తప్పకుండా కట్టే రైతులపై ఆర్థిక భారం పడకుండా చేస్తోన్నామని అన్నారు. ఇప్పటివరకూ 84.66 లక్షల మంది రైతన్నలకు ఇప్పటి వరకూ అందించిన వడ్డీ రాయితీ 2,050 కోట్లుగా వివరించారు.
19 లక్షల మంది రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని జగన్ అన్నారు. ఉచిత విద్యుత్ కింద ప్రతి రైతుకు 45,000 రూపాయల వరకు మేలు జరుగుతోందని చెప్పారు. దీని కోసం ఏడాదికి సుమారు 9,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోన్నామని జగన్న తెలిపారు.
రైతుల తరఫున ఉచిత పంటల బీమాకు ప్రీమియం కడుతున్న ఏకైక రాష్ట్రం తమదేనని జగన్ చెప్పారు. గతంలో ఎప్పుడూ కూడా రైతుల తరఫున బీమా ప్రీమియం చెల్లించలేదని, ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. రైతులకు ఎక్కడ కష్టం వచ్చినా ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications