ఇకపై వైసీపీలో వారే కీలకం - నేరుగా జగన్కే రిపోర్ట్..!!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- ఇవ్వాళ కలియుగ వైకుంఠం తిరుమలను సందర్శించనున్నారు. వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రజల తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అనంతరం పెదశేషవాహన సేవలో పాల్గొననున్నారు. అంతకుముందు- తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారిని కూడా దర్శించుకోనున్నారాయన. రేపు తిరుమలలో పరకామణి మహామండపం, అతిథి గృహాన్ని ప్రారంభిస్తారు.

నంద్యాల జిల్లాలో..
అక్కడి నుంచి నేరుగా నంద్యాల జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తారు. కొలిమిగుండ్లల్లో కొత్తగా నిర్మించిన రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీని వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. జిల్లాగా ఆవిర్భవించిన తరువాత వైఎస్ జగన్ నంద్యాల పర్యటనకు వెళ్లనుండటం ఇదే తొలిసారి. అనంతరం ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలతో వర్క్షాప్ను నిర్వహించనున్నారు. ఇదివరకు రెండుసార్లు వాయిదా పడిన ప్రోగ్రామ్ ఇది. బుధవారం ఈ కీలక సమావేశం షెడ్యూల్ అయింది.

వర్క్షాప్ కీలకం..
వచ్చే సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో- వైఎస్ జగన్ ఇప్పటి నుంచే రాజకీయంగా కీలక అడుగులు వేస్తోన్నారు. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటోన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అభ్యర్థుల విషయంలో కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో భాగమే ఈ వర్క్షాప్. ఇదివరకు దీన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి ఈ వర్క్షాప్ ఉపయోగపడుతోందని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి.

వ్యూహాత్మకంగా..
నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల మధ్య సమన్వయం వంటి అంశాలను వైఎస్ జగన్ నేరుగా పర్యవేక్షించగలుగుతున్నారని వివరిస్తోన్నాయి. క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రత్యర్థుల బలబలాలపై ఓ అవగాహన రావడానికీ ఇది ఉపయోగపడుతోందని, వాటినికి ధీటుగా ఎదుర్కొనడానికి అనుసరించాల్సి వ్యూహాలను రూపొందించుకోవడానికి వీలు కలుగుతోందని పేర్కొంటోన్నాయి.

గడప గడపకు మన ప్రభుత్వం..
ఎమ్మెల్యేల పనితీరుపై గడప గడపకు మన ప్రభుత్వంలో అందిన ఫీడ్బ్యాక్ను వైఎస్ జగన్ కొలమానంగా తీసుకుంటున్నారు. భవిష్యత్లో వాటి ఆధారంగానే టికెట్లను కేటాయించే అవకాశాలు లేకపోలేదు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఏ మేరకు అందుబాటులో ఉంటోన్నారు.. సమస్యల పరిష్కారం చూపుతున్న చొరవ.. సంక్షేమ పథకాల అమలు.. ప్రభుత్వ ఉద్దేశం ఎంత మేర నెరవేరుతోంది.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై మెజారిటీ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను వైఎస్ జగన్ కీలకంగా తీసుకోనున్నారు.

అబ్జర్వర్ అపాయింట్..
ఆయా అంశాలన్నింటినీ పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఓ అబ్జర్వర్ను వైఎస్ జగన్ నియమిస్తారని తెలుస్తోంది. ఎమ్మెల్యే, పార్టీ ఇన్ఛార్జ్, కోఆర్డినేటర్లు మధ్య సమన్వయం ఎలా ఉందనేది విషయాలపై బుధవారం తలపెట్టిన వర్క్షాప్లో చర్చించనున్నారు. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అందిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలకు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని సమాచారం. నియోజకవర్గ అబ్జర్వర్లందరూ నేరుగా వైఎస్ జగన్కే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications