జగన్ మాస్టర్ స్ట్రోక్: అమరావతి ఆర్ 5 జోన్లో ఇళ్ల పట్టాల పంపిణీకి ముహూర్తం
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రాజధాని అమరావతి పరిధిలోని ఆర్ 5 జోన్లో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికి ముహూర్తాన్ని కూడా పెట్టింది. లబ్దిదారులకు ఈ నెల 18వ తేదీన ఆర్ 5 జోన్లో పట్టాలను పంపిణీ చేయనుంది. వైఎస్ జగన్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
అమరావతి ప్రాంతంలో కొత్తగా ఆర్ 5 జోన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీన్ని నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ను సైతం జారీ చేసింది ప్రభుత్వం. కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని జోన్ ఏర్పాటు చేసినట్లు ఇందులో పొందుపరిచింది. ఆర్-5 జోన్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి గల ముఖ్య ఉద్దేశం- పేదల ఇళ్ల నిర్మాణాలు చేపట్టడమే.

అందరికీ ఇళ్లు పథకం కింద అందుబాటులో ఉండే ధరలతో వాటి నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్ 5 పేరుతో జోన్ ఏర్పాటు చేసింది. ఈ పథకం కింద అన్ని జిల్లాల్లో పేదలకు ప్రభుత్వం పట్టాలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయా కాలనీల్లో ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. అదే సమయంలో అమరావతిలో కూడా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం గతంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దాన్నే అమరావతి పరిధలోనూ కొనసాగించడానికి వీలుగా ఆర్ 5 జోన్ను నోటిఫై చేసింది. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో సుమారు 900 ఎకరాల మేర పేదల ఇళ్ల కోసం నోటిఫై చేసింది. దీనికోసం అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్లో కూడా మార్పులు చేర్పులు చేసింది ప్రభుత్వం.

గుంటూరు, విజయవాడకు చెందిన 28 వేల మందికి ప్రస్తుతం ఆర్-5 జోన్ పరిధిలోకి తీసుకువచ్చింది. వారికి ఇళ్ల స్థలాలను కేటాయించింది. దీనిపై రాజధాని రైతులు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అడ్డుకోవాలంటూ పిటీషన్ వేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఇళ్ల పట్టాల పంపిణీపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.
దీనితో అమరావతి ప్రాంత రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పెషల్ లీవ్ పిటీషన్ను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. ఇళ్ల పట్టాల పంపిణీపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఏపీ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఈ స్పెషల్ లీవ్ పిటీషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications