ఎన్నికలు: కెసిఆర్, జగన్లతో కాంగ్రెసు దోస్తీ వ్యూహం?
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో సానుకూల ఫలితాల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పట్నుంచే తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 42 లోక్ సభ స్థానాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం, నేతలను చేర్చుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులతో ఇప్పటికే తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం ద్వారా టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టింది. అయితే తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్ ప్రవేశపెట్టి ఆమోదించిన తర్వాతనే విలీనంపై ఆలోచిస్తామని టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గతంలోనే చెప్పారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చినట్లు తెలిపి, ఇప్పుడు వెనక్కి తగ్గడంతో తెలంగాణ ప్రాంతంలో టిడిపి పార్టీ కొంతమేర నష్టపోయే అవకాశాలున్నాయి. దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. కాగా టిఆర్ఎస్ పార్టీలో తమ పార్టీ వైపు చూస్తున్న కొందరు నేతలను కాంగ్రెస్ ఆహ్వానాలు పంపుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకురాలిగా కొనసాగిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన మరో ముగ్గురు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంత మంది నేతలు కూడా టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొండా సురేఖ, కొండా మురళి, మక్కాన్ సింగ్ ఠాకూర్, కెకె మహేందర్ రెడ్డిలతోపాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్రలో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా సమైక్యాంధ్ర ప్రచారం చేయించి లాభం పొందాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో టిఆర్ఎస్, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకుని రెండు ప్రాంతాల్లోనూ అత్యధిక పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మంగళవారం చంచల్ గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. బుధవారం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన జగన్ సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంపై చర్చించినట్లు సమాచారం. సమైక్యాంధ్ర ఉద్యమంలో పార్టీ నాయకులు పాల్గొనాలని, ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిసింది.
కాగా కాంగ్రెస్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగానే జగన్కు బెయిల్ లభించిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందా లేక బిజెపితో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతుందా అనే విషయంపై చంద్రబాబు ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.