"లోకేష్ ముందు చినరాజప్ప వణికిపోతున్నారు? ఇక పోలీసులేం వింటారు!"
విజయవాడ : టీడీపీ నేతల ధన దాసోహం ఎంతకీ తీరందని.. ఇసుక దందాలో ఉన్నదంతా టీడీపీ ఎమ్మెల్యేలే అని ఆరోపించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ఏపీలో పాలనంతా అస్తవ్యస్థంగా తయారైన పరిస్థితి నెలకొందని, పలు అంశాల్లో న్యాయస్థానాల మాటలను సైతం లెక్కచేయకుండా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ పాలనను దుయ్యబడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు బొత్స. స్విస్ చాలెంజ్ విషయంపై కోర్టు ప్రశ్నించగానే చంద్రబాబు ఏకంగా చట్టాలనే మార్చేస్తూ పోతున్నారని ఆరోపించారు. చట్టాలను మార్చేసి ఏం చేసినా చెల్లిపోతుందనుకుంటున్నారా? అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.
ప్రభుత్వం స్వార్థ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డ ఆయన.. సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను సింగపూర్ కంపెనీలకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో టీడీపీ కోసం డబ్బు సంచులు పంపినవారికి ఇప్పుడు ప్రభుత్వం దోచిపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురిస్తే.. కనీసం ఏపీ మంత్రులు ఎక్కడా పర్యటించలేదన్నారు. ఇక సీఎం తనయుడు లోకేష్ ప్రభుత్వాన్ని సైతం శాసిస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక హోంమంత్రి చినరాజప్ప సైతం లోకేష్ ముందు వణికిపోతూ మాట్లాడుతున్నారని, ఇలా అయితే ఆయన మాట పోలీసులేం వింటారని నిలదీశారు. ప్రస్తుతం ఏపీలోని అన్ని ప్రభుత్వ శాఖలల్లో అవినీతి పేరుకుపోయిందని, టీడీపీ నేతలు ఆయా శాఖలను అవినీతిలో ముంచేశారని ఫైర్ అయ్యారు.