శ్రీరస్తు.. శుభమస్తు.. శ్రీకారం చుట్టుకున్న కోటిగోటి తలంబ్రాలు
శ్రీరామనవమి రోజు భద్రాచలంలో సీతారాములవారి కల్యాణం కనులారా చూడాలని తపించే భక్తులు దేశవ్యాప్తంగా నవమి ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఆరోజు స్వామివారి కల్యాణానికి ముత్యాల తలంబ్రాలను ఉపయోగిస్తారు కాబట్టి. కల్యాణ సమయంలో స్వామి వారికి ఉపయోగించే ముత్యాల తలంబ్రాలు ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయి.
ముత్యాల తలంబ్రాలకు ఉపయోగించే బియ్యాన్ని సైతం రామభక్తులు గోటితో ఒలిచి భద్రాద్రి ఆలయానికి సమర్పిస్తుండటం ఆనవాయితీ. ఏపీ, తెలంగాణలోని రామభక్తి బృందాలు 45 రోజులపాటు ఆర్గానిక్ పద్ధతిలో వరిని సాగుచేసి, వాటిని నూర్పిడి చేసి, గోటితో బియ్యంగా మార్చి కాలినడకన భద్రాచలానికి వచ్చి భక్తిపారవశ్యంతో సమర్పిస్తుంటారు.

గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో కోటి తలంబ్రాల పంటకు విత్తనాలు వేసే కార్యక్రమం జరిగింది. కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో శ్రీరాముడు, వానరసేన వేషధారణలతో నాగలి దున్ని, వరి విత్తనాలను నాటారు. భద్రాచలం రాములవారి కల్యాణానికి కోటి గోటి తలంబ్రాల పంటకు ప్రతి ఏటా ఇక్కడ నుండే శ్రీకారం చుడతారు. భద్రాచలం, ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణాలకు గోటితో వలిచి కోటి తలంబ్రాలు అందజేస్తారు.
వడ్లను స్వయంగా కోసి, నూర్పిడి చేసి, గోటితో బియ్యంగా మార్చి, పాదయాత్ర చేసుకుంటూ భద్రాచలం చేరుకొని వీటిని ప్రతి ఏడాది భక్తులు సమర్పిస్తున్నారు. శ్రీరామచంద్రులవారికి ఐదు రాష్ట్రాల్లో మూడువేల మంది కోటి తలంబ్రాలను ఒలిపించి రాజమండ్రి పుష్కరఘాట్ లోని శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో సమర్పిస్తుంటారు. అయోధ్యలో కూడా స్వామివారి కల్యాణం ఏర్పాటు చేయాలని, దేశమంతా రామభావన తీసుకురావాలనే ఉద్దేశంతో గత ఏడాది సరయు నదీ తీరంలో 108 కలశాలతో అభిషేకం చేసి అయోధ్యకు తలంబ్రాలు సమర్పించారు.












Click it and Unblock the Notifications