చంద్రబాబుపై అలా వ్యాఖ్యలు: టిడిపిలోకి దాడి రీఎంట్రీ కష్టమేనా?
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరడానికి దరఖాస్తు పెట్టుకున్న మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు ఇటీవల ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. అలా వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయనను చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి అహ్వానిస్తారా అనేది అనుమానంగానే ఉందని అంటున్నారు.
ఎన్టీఆర్కు భారతరత్న ఇప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని, లక్ష్మీపార్వతి అవార్డును అందుకుంటారనే ఉద్దేశంతో ఎన్టీఆర్కు భారతరత్న వచ్చేలా ప్రయత్నాలు చేయడం లేదనే అపప్రథ వస్తుందని, చంద్రబాబు తలుచుకుంటే భారతరత్న వస్తుందని దాడి వీరభద్రరావు అన్నారు.
ఆ విషయం అలా ఉంచితే, ప్రత్యేక హోదా సాధించడంలో కూడా చంద్రబాబు తగిన విధంగా వ్యవహరించడం లేదని, కేంద్రంపై చంద్రబాబు జాతీయ స్థాయిలో ఒత్తిడి తేగల సమర్థుడని, అయితే ఆయన అందుకు పూనుకోవడం లేదని దాడి వీరభద్రరావు అన్నారు.

చంద్రబాబు పాలన కూడా ఆయన స్థాయికి తగిన విధంగా లేదని, పలు విషయాల్లో చంద్రబాబు పథకాలు సరిగా అమలు కావడం లేదని దాడి అంటూ రుణమాఫీ పథకం అమలులోని లోపాలను ఎత్తి చూపారు. ప్రభుత్వ వ్యతిరేకత రాష్ట్రంలో ఉందని కూడా దాడి వీరభద్ర రావు అన్నారు. ఇలా చంద్రబాబు పాలనపై, ఆయన తీరుపై నిర్మొహమాటంగా దాడి వీరభద్రరావు కొన్ని వ్యాఖ్యలు చేశారు.
దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీలోకి రాకుండా మంత్రి అయ్యన్నపాత్రుడు అడ్డుపడుతున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. అయితే, చంద్రబాబు తలుచుకుంటే ఎవరు అడ్డుపడినా ఏమీ కాదని, చంద్రబాబు తనను తీసుకునే విషయంలో తలుచుకోవడం లేదని దాడి వీరభద్రరావు అన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత దాడి వీరభద్రరావును చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి అహ్వానిస్తారా అనే సందేహం ఎవరికైనా కలగడం సహజం.












Click it and Unblock the Notifications