తిరుమలకు నడవలేక మోకాళ్ల నొప్పితో ఇబ్బందులు పడిన పవన్ కల్యాణ్
తిరుమల శ్రీవారి లడ్డుల తయారు చెయ్యడానికి కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూసిన తరువాత ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీక్ష విరమించడానికి కాలి నడకన తిరుమలకు బయలుదేరారు. మంగళవారం సాయంత్రం అలిపిరి మెట్ల దగ్గర ప్రత్యేక పూజలు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తరువాత అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు బయలుదేరారు.
పవన్ కళ్యాణ్ వెంట ఆయన ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బంది, తిరుపతి రెవిన్యూ అధికారులు, టీటీడీ అధికారులు, అటవీ శాఖ అధికారులు నడక మార్గంలో తిరుమల బయలుదేరారు. మార్గం మధ్యలో నరసింహ స్వామి దేవాలయం వరకు పవన్ కల్యాణ్ సాఫీగానే చేరుకున్నారు. ఆ తర్వాత కొంత దూరం వెళ్లిన పవన్ కల్యాణ్ మోకాళ్ళ నొప్పితో చాలా ఇబ్బందికి గురయ్యారు. విపరీతమైన మోకాళ్ల నొప్పి రావడంతో మెట్ల పైన పవన్ కల్యాణ్ విశ్రాంతి తీసుకున్నారు.

ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన రోజే తాను అలిపిరి మెట్ల మార్గం నుండి కాలి నడక మార్గంలో తిరుమల వెళ్లి దీక్ష వర్ణిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అలిపిరి నుండి మెట్ల మార్గాన తిరుమల వెళ్తున్న పవన్ కల్యాణ్ మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడినా దీక్షకు భంగం కలగకూడదని కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ కాలి నడకన తిరుమలకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న స్విమ్స్ కు చెందిన ఫిజియోథెరపిస్ట్, కొందరు వైద్యులు పవన్ కల్యాణ్ కు చికిత్స అందించడానికి తిరుమల బయలుదేరి వెళ్లారు.
మంగళవారం రాత్రి తిరుమల చేరుకున్న తరువాత విశ్రాంతి తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. బుధవారం మధ్యాహ్నం వరకు తిరుమలలోనే ఉంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం సాయంత్రం తిరుపతికి చేరుకొని జ్యోతిరావు పూలే సర్కిల్ లో ఏర్పాటు చేసిన వారాహి సభలో ప్రసంగించనున్నారు. తిరుమల శ్రీవారి లడ్డుల తయారీ కోసం కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూసిన సందర్భంగా పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications