ఏపీపై పగబట్టిన సూర్యుడు, వరుణుడు
నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం మూడు రోజులు ముందుగానే జూన్ రెండోతేదీన రాష్ట్రంలోకి ప్రవేశించి 20వ తేదీకి రాష్ట్రమంతటా విస్తరించాయి. అయితే ఉత్తరాంధ్రపై అధిక పీడన ద్రోణి ప్రభావంతో నిశ్చలంగా ఉండిపోయాయి. రాష్ట్రమంతటా వ్యాపించినప్పటికీ ఆశించిన స్థాయిలో వానలు కురవడంలేదు. ఎండలు మాత్రం మండిపోతున్నాయి. రాష్ట్రం మొత్తం నిప్పుల కుంపటిపై ఉంది. ఉక్కపోత, వేడితో ప్రజలు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. రోహిణీకార్తెలో ఎండలు మండిపోయినట్లుగా మండిపోతున్నాయి.
బయటకు రావాలంటేనే భయపడుతున్నారు
ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, రాత్రివేళ కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఆవర్తనం లేదంటే అల్పపీడనం ఏర్పడి వర్షాలు కురిస్తేనే ఈ పరిస్థితి మారుతుందని, వాతావరణం చల్లబడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ద్రోణి కేరళ, కర్ణాటక తీరాలమీదుగా కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రానున్న మూడురోజుల్లో తేలికపాటి జల్లులు లేదంటే మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

పిడుగులు పడతాయి
రాష్ట్రంలో పిడుగులు పడటంతోపాటు గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఎండలు మండిపోతున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యమైన పనులుంటే ఉదయం పదిగంటల్లోపుగా పూర్తిచేసుకోవాలని, ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications