జగన్.. పిచ్చివేషాలొద్దు, ఒళ్లు దగ్గర పెట్టుకో: ఉమా
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ఉమామహేశ్వర రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఆర్థిక నేరగాడివి, పగటి వేషాగాడివైన నువ్వు, ఒళ్లు దగ్గర పెట్టుకుని బతుకు' అంటూ దేవినేని తీవ్రంగా హెచ్చరించారు. అంతేగాక, 11 కేసుల్లో జగన్ ఏ-1 నిందితుడని, ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి లాంటి వారు ఆయన అనుచరులని విమర్శించారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ‘మెడనొప్పి ఉందని శాసనసభలో మాట్లాడలేని జగన్.. నా మెడలు వంచుతాడట. ఆయనకు అంత సీన్ ఉందా?' అని దేవినేని ప్రశ్నించారు. దోచుకున్న డబ్బనంతా ఈడి అటాచ్ చేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో జగన్ కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు.
రుణమాఫీ అసాధ్యమని చెప్పిన జగన్కు.. తాము రుణమాఫీ చేసి చూపించామని దేవినేని అన్నారు. వైయస్ హయాంలో రైతులపై కాల్పులు జరిపించారని, ఆ ఘటనలో కొంతమంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్న విషయాన్ని జగన్ గుర్తు చేసుకోవాలని సూచించారు.
ఓదార్పు యాత్రలో పేరుతో తిరుగుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డిపై ఆరోపించారు. భూసేకరణ పేరుతో వైయస్ హయాంలో వాన్ పిక్ కోసం 29వేల లాక్కున్నారని మండిపడ్డారు. వైయస్ దత్తపుత్రుడు గాలి జనార్ధన్ రెడ్డికి 14వేల ఎకరాల భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. ఏపి సిఎం చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్కు లేదని అన్నారు.