ఆట మొదలైంది: టీడీపీ-జనసేనతోనే బీజేపీ: వైసీపీ సడెన్ ఎటాక్ వెనుక..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీని వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఢిల్లీ నేతలకు సెగ తగిలేనా ఆరోపణలకు పదును పెడుతోంది. ఏకంగా జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలతో ఒక్క సారిగా రెండు పార్టీల మధ్య వాతావరణం వేడెక్కింది. దీని పైన బీజేపీ ముఖ్య నేతలు సైతం తీవ్రంగా స్పందించారు. జగన్ కేసులతో సహా..బెయిల్ రద్దు అంశం పైన ఆ పార్టీ ముఖ్య నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు.

బీజేపీ లక్ష్యంగా వైసీపీ నేతల ఫైర్..
ఏపీలో కొందరు బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే విధంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి అంజాద్ బాషా బీజేపీని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేసారు. బీజేపీ మతతత్వ పార్టీ అంటూ ఆయన విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఏపీలో ఏదో ఒక రకంగా లబ్ధిపొందాలని చూస్తున్నారని, రాష్ట్రంలో బలం పెంచుకోవాలని బీజేపీ మత రాజకీయం చేస్తోందని అంజాద్ బాషా ద్వజమెత్తారు. ఇక, పార్టీ ముఖ్యనేత సజ్జల సైతం తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.

జగన్ కేసుల ప్రస్తావనతో సీరియస్..
జగన్ కేసుల గురించి బీజేపీ నేతలు మాట్లాడటం పైన మండిపడ్డారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు. అప్పులు చేయని రాష్ట్రం ఏదైనా ఉందా అంటూ ప్రశ్నించారు. బీజేపీ పాలిన రాష్ట్రాలు సైతం ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉన్నాయని...బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏమైనా నోట్లు ముద్రించుకున్నాయా అంటూ నిలదీసారు. తాము కేంద్రం పైన విమర్శలు చేయలేదని..బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకే సమాధానం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. కేంద్రం చేసిన అప్పుల గురించి తాము ప్రశ్నించలేదన్నారు.

పోలవరం నిధులు ఇచ్చి..క్రెడిట్ తీసుకోండి
ఇన్ని మాట్లాడుతున్న బీజేపీ నేతలు పోలవరం కు నిధులు తీసుకొచ్చి ఆ క్రెడిట్ వారి ఖాతాలోనే వేసుకోవాలంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్..అదే విధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల పైన ఘాటుగా స్పందించారు. వారిద్దరూ చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యారు. అయితే, వైసీపీ ఇంత సడన్ గా బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తుందనే ఆసక్తి కర చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. నిత్యం టీడీపీ ...అప్పడుప్పుడు జనసేన పైన విరుచుకుపడే వైసీపీ నేతలు ఇప్పుడు బీజేపీనే ప్రధానంగా టార్గెట్ చేయటం వెనుక ఢిల్లీ పరిణామాలే కారణమా..లేక, రాష్ట్ర స్థాయిలో బీజేపీ నేతలు మతం పేరుతో చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టే వ్యూహంలో భాగమా అనే చర్చ సాగుతోంది.

ఢిల్లీలో-ఇక్కడ రాష్ట్రంలోనూ ఒకే రీతిలో..
అటు పార్లమెంట్ లో సైతం వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే, అక్కడ కేంద్రం నుంచి వైసీపీ ఎంపీల డిమాండ్ల పైన ఎక్కడా సానుకూల స్పందన కనిపించటం లేదు. ప్రధానంగా పోలవరం సవరించిన అంచనాలను అమోదించాలనేది ప్రధాన డిమాండ్ గా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికీ దీని పైన కేంద్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక, ఇదే సమయంలో పోలవరం నిర్వాసితుల సమస్య పైన టీడీపీ వాయిస్ నే బీజేపీ వినిపిస్తోందని వైసీపీ వ్యాఖ్యానిస్తోంది. నిధులు ఇవ్వాల్సిన కేంద్రం...ఇవ్వకపోగా ఏపీ ప్రభుత్వాన్ని డామేజ్ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయనేది వైసీపీ నేతల వాదన.

ఏపీలో మత పరమైన అంశాలను వివాదం చేస్తూ..
ఏపీలో సున్నితమైన మత పరమైన అంశాలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవటం సైతం వైసీపీ ముఖ్య నేతల ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ -జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు టీడీపీని ఆ రెండు పార్టీలతో కలిపటం ద్వారా ఆ మూడు పార్టీలు ఒక్కటేననే అభిప్రాయం కలిగించే ప్రయత్నం వైసీపీ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక, బీజేపీతో కలిసేందుకు టీడీపీ సైతం ప్రయత్నాలు చేస్తుందనే వాదన ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. బీజేపీ - వైసీపీ మధ్య సాగుతున్న డైలాగ్ వార్ ను టీడీపీ జాగ్రత్తగా గమనిస్తోంది.

ఆసక్తిగా గమనిస్తున్న టీడీపీ..సమయం కోసం..
టీడీపీ కోరుకున్నది సైతం ఇటువంటి పరిస్థితినే. దీంతో..ఇదే పరిస్థితి మరి కొంత కాలం కంటిన్యూ అవుతే..ఏపీలో త్వరలోనే రాజకీమ సమీకరణాలు కీలక మలుపు తీసకొనే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 13వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఇప్పుడు కేంద్రంలో బిల్లులు రాజ్యసభలో పాస్ చేసుకోవాలన్నా..త్వరలో జరిగే రాష్ట్రపతి- ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీకి వైసీపీ మద్దతు అవసరమనే వాదన ఉంది. కానీ, వైసీపీకి మాత్రం కేంద్ర ప్రభుత్వ పరంగా ఏపీకి సాయం మినహా..మరే రకంగానూ అవసరం లేదనే అభిప్రాయం కనిపిస్తోంది. దీంతో..అటు బీజేపీ - ఇటు వైసీపీ నేతలు ఈ సమస్య పైన పరిష్కరించుకొ నే ధోరణితో ముందుకు వెళ్తారా...లేక, ఇక ఇదే రకంగా ఒకరి పైన మరొకరు ఆరోపణలు-విమర్శలతో రాజకీయం కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications