ఏం జరిగింది?: మహిళ ఒంట్లోకి దూసుకెళ్లిన బుల్లెట్
విశాఖపట్నం: నగర పరిధిలోని మర్రిపాలెం రైల్వే స్టేషన్లో ఒక మహిళ శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోయిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. మొదట రాయి తగిలిందని భావించిన బాధితురాలు వైద్యుల దగ్గరికెళ్లి వైద్యం చేయించుకుంది. ఆ తర్వాత నొప్పి తీవ్రతరం కావడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఎక్స్రే తీయగా ఆమె శరీరంలోని ఛాతి భాగంలో బుల్లెట్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆమెకు వైద్యం చేసి బుల్లెట్ను తొలగించారు.
కాగా, బాధితురాలు, ఆమె బంధువులు చెప్పిన వివరాలు ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి సమీపంలోని ఓడ్రాపల్లికి చెందిన శ్రీకాకుళం సత్య(28) జలుమూరు మండలం కొండకామేశ్వరిపేటలోని తల్లిగారింటికి వెళ్లేందుకు భర్త మాధవరావు, తల్లి శిమ్మమ్మ, వదిన లక్ష్మి, అన్నయ్య రాజుతో పాటు మరో ముగ్గురు చిన్నారులతో కలిసి బుధవారం ఉదయం మర్రిపాలెం రైల్వేస్టేషన్కు చేరుకున్నారు.
వారంతా రైలు కోసం నిరీక్షిస్తుండగా ఉదయం 11 గంటల సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ బుల్లెట్ సత్య వీపులోపలికి దూసుకుపోయింది. రక్తస్రావం కావడంతో వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా చిన్న రాయి తగిలి ఉంటుందని భావించిన అక్కడి వైద్యుడు ప్రథమ చికిత్స చేసి పంపించేశారు.

కొద్ది సేపటికే తట్టుకోలేని నొప్పి రావడంతో వేరొక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎక్స్రే తీయగా.. ఆమె ఛాతిలో బుల్లెట్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. అక్కడి నుంచి ఆమెను కారులో నరసన్నపేట తీసుకువచ్చి స్థానిక ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఇక్కడి వైద్యులు
శస్త్రచికిత్స చేసి బుల్లెట్ను బయటకు తీశారు. బుల్లెట్ ఊపిరితత్తులకు సమీపంలో ఆగిపోవడంతో ప్రమాదం తప్పిందని, ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారు.
నరసన్నపేట ఎస్సై చిన్నంనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ శరీరంలోకి దూసుకెళ్లింది 9 ఎంఎం బుల్లెట్గా పోలీసులు చెబుతున్నారు. అతి సమీపం నుంచే కాల్పులు జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు? ఎందుకు చేసి ఉంటారన్నది తెలియలేదు.












Click it and Unblock the Notifications