ఎన్టీఆర్ సినిమా కోసం వెళ్లాడు: ఆ దాడితో ప్రాణాలే కోల్పోయాడు..
జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా జై లవకుశ బెనిఫిట్ షో కోసం బయలుదేరగా.. మార్గమధ్యలో వారు దాడి చేసినట్లు తెలుస్తోంది.
గుంటూరు: జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా జై లవకుశ బెనిఫిట్ షో కోసం బయలుదేరిన ఓ బాలుడిపై కొంతమంది మందుబాబులు విచక్షణారహితంగా దాడి చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై తాడేపల్లి బైపాస్ రోడ్డులో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లి పట్టణ పరిధిలోని పాత ఒకటో వార్డులో నివాసముండే శ్రీకాంత్(16) ఇళ్లల్లో సీలింగ్ పనులు చేస్తుంటాడు. మెకానిక్గా పనిచేసే ఉండవల్లికి చెందిన అన్వర్, సెల్పాయింట్లో పనిచేసే ఎస్కే ఆజూలు శ్రీకాంత్ స్నేహితులు.
ఎన్టీఆర్ సినిమా కోసం:
బుధవారం పగలంతా ఎవరి పనులకు వారు వెళ్లిపోయారు. సాయంత్రం పని నుంచి వచ్చాక.. ముగ్గురు కలిసి ఎన్టీఆర్ కొత్త సినిమా జై లవ కుశ బెనిఫిట్ షో వెళ్లాలనుకున్నారు. అర్థరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత ఆజూ ద్విచక్ర వాహనంపై ముగ్గురు కలిసి సినిమాకు బయలుదేరారు.
ఒకటో వార్డు నుంచి బయలుదేరి కుంచనపల్లి బకింగ్ హామ్ కరకట్ట నుంచి అరవింద స్కూల్ మీదుగా బైపాస్ రోడ్డు చేరుకున్నారు. అయితే అప్పటికే రోడ్డు పక్కన ఫూటుగా తాగి ఉన్న నలుగురు యువకులు ఆజూ బైక్ ఆపారు. అర్థరాత్రి రోడ్లపై ఏం పనిరా?, పిల్ల వెధవల్లారా దొంగల్లా కనిపిస్తున్నార్రా మీరు.. అంటూ దాడికి దిగారు.
శ్రీకాంత్ను వదిలేసి వెళ్లిపోయారు:
విచక్షణారహితంగా దాడికి దిగడంతో భయపడ్డ ఆజూ, అన్వర్.. శ్రీకాంత్ను వదిలేసి అక్కడి నుంచి పరుగుతీశారు. దీంతో మందుబాబులు శ్రీకాంత్ ను చావబాదారు. అక్కడినుంచి ఓల్డ్ టోల్ గేట్ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ కూడా దాడికి పాల్పడ్డారు.అక్కడ రోడ్డు పక్కన ఉన్న వైన్స్ లో మద్యం తీసుకుని తాగాక.. అక్కడ కూడా చితకబాదారు.
రాత్రంతా తిప్పుతూ దాడి:
ఓల్డ్ టోల్ గేట్ నుంచి కుంచనపల్లి కీర్తి ఎస్టేట్ వద్దకు బాలుడిని తీసుకుపోయారు. ఆ తర్వాత అభినందన రోడ్డులోకి తీసుకెళ్లి అక్కడ మరోసారి దాడి చేసి వదిలేశారు. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని గమనించిన స్థానికులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు.
ఆసుపత్రిలో మృతి:
గురువారం మధ్యాహ్నాం వరకు శ్రీకాంత్ వివరాలేవి పోలీసులకు తెలియరాలేదు. అప్పటికే కొడుకు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన శ్రీకాంత్ తల్లి సబిత.. ఆజూ, అన్వర్ లను నిలదీయడంతో అసలు విషయం చెప్పారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఇంతలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ మృతి చెందాడు. కొడుకు మరణంతో తల్లి కన్నీరుమున్నీరైంది.
ఘటనపై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు దాడికి పాల్పడిన ఆరుగురు యువకులు గంధం నరేష్, చెన్నంశెట్టి గోపాలకృష్ణ,అమరా వేణు, మిరియాల నవీన్, గుంటముక్కల శేషు, మిరియాల వెంకటేశ్ లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా కుంచనపల్లి గ్రామానికి చెందినవారేనని తెలిపారు.