ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
APSRTC: ఇంకో రెండ్రోజుల్లో దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ఆరంభం కానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు పండగ శోభను సంతరించుకుంటోన్నాయి. అమ్మవారి ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ నెల 3వ తేదీన దసరా పండగ మొదలు కాబోతోంది. 12వ తేదీన విజయదశమి. ఈ పండగలో భాగంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సెలవులను ప్రకటించాయి. ఈ క్రమంలో ఇక బస్సులు, రైళ్లకు ప్రయాణికుల తాకిడి ఏర్పడబోతోంది.

ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడిపించనున్నారు. మొత్తం 6,100 బస్సులను అదనంగా ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకుని రానున్నారు. తిరుమలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకూ ప్రత్యేక బస్సులను నడిపించనున్నారు.
సాధారణంగా పండగ సమయాల్లో ప్రవేశపెట్టే అదనపు బస్ సర్వీసుల్లో 50 శాతం మేర అదనపు ఛార్జీలను వసూలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా దీనికి బ్రేక్ పడింది. ప్రత్యేక బస్సుల్లో అదనంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.
అంతేకాకుండా ఛార్జీలపై రాయితీలను సైతం అమలు చేయనున్నారు. ఆన్లైన్ ద్వారా ఒకేసారి రానుపోను టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్పై 10 శాతం రాయితీ వర్తిస్తుంది. ఇది కొన్ని రద్దీ మార్గాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కడప, గుంటూరు, కాకినాడ వంటి నగరాలకు అదనపు బస్సులను నడిపించనున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి పొరుగు రాష్ట్రాల రాజధానుల నుంచీ వివిధ ప్రాంతాలకు బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
తిరుమల, అరుణాచలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం.. వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు అదనపు బస్సులను నడిపించనున్నారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు. వాటన్నింటినీ పర్యవేక్షించడానికి రౌండ్ ద క్లాక్ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయనున్నారు.
దీనితో పాటు ప్రముఖ పర్యాటక కేంద్రాలకు ప్యాకేజీ టూర్లను కూడా ప్రవేశపెట్టనున్నారు. కాణిపాకం-గోల్డెన్ టెంపుల్, శ్రీశైలం, అరకు- బొర్రా గుహలు, బెలుం, లేపాక్షి, తలకోన వంటి ప్యాకేజీ టూర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాటిని మరింత విస్తరించనున్నారు.












Click it and Unblock the Notifications