ఏపీలో ఎన్నికలు ఎప్పుడు - డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..!!
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగానే రానున్నాయా. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కారణమయ్యాయి. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు డిసెంబరు లేదా జనవరిలో జరిగే అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర పేర్కొన్నారు. కొంత కాలంగా ప్రతిపక్షాలు సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారంటూ చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలోని డిప్యూటీ మంత్రి చేసిన వ్యాఖ్యలతో మరో సారి కీలక అంశంగా మారింది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 30వ తేదీకి నాలుగేళ్లు పూర్తవుతుంది. షెడ్యూల్ ప్రచారం అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు పార్టీ నేతలను సిద్దం చేస్తున్నారు. ప్రతీ ఇంటికి పార్టీ నేతలను పంపి ప్రజా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో పర్యటనలు పెంచారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందని నమ్మితేనే తనకు అండగా నిలవాలని కోరుతున్నారు. ప్రతిపక్షాలు పొరపాటున అధికారంలోకి వస్తే స్కీంలు ఆగిపోతాయని హెచ్చరించారు. అటు ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన విమర్శలను పెంచాయి. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ పొత్తులతో ముందుకు వెళ్తున్నారు.

కొంత కాలంగా ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పలు సందర్భాల్లో సీఎం జగన్ ముందస్తుకు సిద్దం అవుతున్నారంటూ పార్టీ సమావేశాల్లోనూ.. రోడ్ షో లోనూ చెబుతూ వచ్చారు. దీనిని వైసీపీ ముఖ్య నేతలు ఖండించారు. తమ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. తమ పార్టీ నేతలను సిద్దం చేసుకొనే క్రమంలోనే ముందస్తు పైన ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం రాజన్న దొర ఎన్నికల పైన చేసిన వ్యాఖ్యలతో మరోసారి సారి ముందస్తు ఎన్నికల పైన చర్చ మొదలైంది. పార్వతీపురంలో మాట్లాడిన రాజన్న దొర ఈ ఏడాది చివరల్లోనే ఎన్నికలు ఉంటాయని.. ఈసారి ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని ధీమావ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications