'ట్రాఫిక్ కానిస్టేబుల్కు కూడా జగన్ అవినీతి తెలుసు, గిన్నిస్ బుక్లో చోటు'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి ట్రాఫిక్ కానిస్టేబుల్ను అడిగినా చెబుతారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు శుక్రవారం నాడు ధ్వజమెత్తారు.
కుటుంబ ఆస్తులను ప్రకటించిన ఘనత దేశ రాజకీయ చరిత్రలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిది అన్నారు. ఇదే తరహాలో అన్ని పార్టీల నాయకులూ ముందుకొచ్చి వారి వారి ఆస్తులను ప్రకటించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
అవినీతి చక్రవర్తిగా పేరు పొంది జైలు జీవితం గడిపిన జగన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు, తమ పార్టీ యువనేత నారా లోకేష్ను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు పైన అనేక ఆరోపణలు చేశారన్నారు.
వాటి విషయంలో కోర్టుకు ఎక్కి కూడా నిరూపించలేకపోయారన్నారు. ఈ విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. అవినీతిలో ఆయన గిన్నిస్ బుక్కు ఎక్కుతారని ఎద్దేవా చేశారు. టిడిపిలో సామాన్య కార్యకర్త ప్రమాదవశాత్తు మరణించినా వారి కుటుంబానికి రూ.2 లక్షలు ఇచ్చి ఆదుకుంటున్నామన్నారు.
దేశ చరిత్రలో నదులు అనుసంధానం చేసిన ఘనత టిడిపిదే అన్నారు. రూ.32 కోట్లతో తాగు, సాగునీరు అందించడం ద్వారా 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందారన్నారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి రేటు దూసుకుపోతోందన్నారు.