ప్రతీ పైస పైసకు లెక్క.. పీఏసీ మీటింగ్లో పయ్యావుల, సమావేశంలో అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గణనీయంగా పెరిగినందున ప్రజా పద్దుల కమిటీ బాధ్యతలు మరింత పెరిగాయని చైర్మన్ పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. సంబంధిత శాఖల్లో కూడా బాధ్యత పెరిగిందని గుర్తుచేశారు. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలని అధికారులను కోరారు. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం అమరావత అసెంబ్లీ సమావేశ మందిరంలో ప్రజా పద్దుల కమిటీ తొలి సమావేశం జరిగింది. ఇంచార్జీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సహా సభ్యులు బాల సుబ్రహ్మణ్యం, బీద రవిచంద్ర, జోగి రమేశ్, మేరుగ నాగార్జున, అధికారులు పాల్గొన్నారు.
సలహాలు, సూచనలు
తొలి సమావేశం కావడంతో అధికారులను కమిటీ చైర్మన్, సభ్యులకు ఇంచార్జీ సీఎస్ పరిచయం చేశారు. తర్వాత వారి నుంచి సలహాలు, సూచనలను కమిటీ స్వీకరించింది. అన్నిశాఖల పద్దులను సక్రమంగా ఖర్చు చేసి లెక్కలు చూపాలని అధికారులను చైర్మన్ పయ్యావుల కేశవ్ కోరారు. ప్రభుత్వ విధానాలను అవలంభిస్తూనే.. ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలని సూచించారు. నిధుల వినియోగానికి సంబంధించి లెక్కలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. అవసరమైతే సిబ్బందిని కూడా నియమించుకోవాలని సజెస్ట్ చేశారు. విద్యా, వైద్యం, భవనాలు, రహదారులు, వ్యవసాయం, సాధారణ నిధుల్లో వ్యయానికి సంబంధించి సమస్యలు వస్తున్నాయని చెప్పారు.
నిబద్ధతతో పనిచేయండి..
సంక్షేమ పథకాలకు సంబంధించి సీఎం జగన్ ఎంత దూరదృష్టితో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే జోగి రమేశ్ అభిప్రాయపడ్డారు. అధికారులు కూడా అంతే నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. మరోవైపు ప్రజా పద్దులపై ఉన్న అవకాశాలను అధికారులు అందిపుచ్చుకొని, తదనుగుణంగా పనిచేయాలని ఎమ్మెల్సీ బాల సుబ్రమణ్యం కోరారు. ఆయా శాఖల అధికారులు త్వరగా పద్దుల వివరాలను పూర్తిచేయాలని ఎమ్మెల్సీ బీద రవింద్ర కోరారు.
బాధ్యత మీదే..
పీఏసీ సమావేవంలో ప్రతీ అంశాన్ని అందుబాటులో ఉంచామని ఇంచార్జీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆయా సమస్యలపై పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. పద్దుల్లో వచ్చిన సమస్యలపై దాటవేత ధోరణి కాకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. సమావేశంలో సీఎస్ సహాయ కార్యదర్శి డి.సాంబశివరావు, రెవెన్యూ కార్యదర్శి ఉషారాణి, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీ సత్యనారాయణ, సంబంధిత శాఖల ప్రధాన కార్యదర్శులు, కమిషనర్లు, డైరక్టర్లు పాల్గొన్నారు.
పయ్యావులకు అస్వస్థత..
పీఏసీ సమావేశం జరుగుతుండగా చైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. సమావేశం మధ్యలో వాంతులు చేసుకున్నారు. దీంతో వెంటనే అసెంబ్లీ డిస్పెన్సరీలో ఆయనకు చికిత్స అందజేశారు. అక్కడ ఆయన కోలుకున్నారు. తర్వాత అక్కడినుంచి విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.