ఇంట్లో భారీ పేలుడు పదార్థాలు: వ్యక్తి అరెస్ట్, పోలీసుల నిఘా
విజయనగరం: విజయనగరం జిల్లాలోని బొబ్బిలిలోని ఓ ఇంట్లో భారీ పేలుడు పదార్థాలు పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. దీనిపై శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ రమణమూర్తి మాట్లాడారు. నిషేధిత పేలుడు పదార్ధాల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.
పేలుడు పదార్థాల విక్రయాలు చేయడం నేరమన్నారు. బొబ్బిలిలో అక్రమంగా పేలుడు పదార్థాలను విక్రయిస్తున్న శ్రీనివాసరావు అనే వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి కొన్ని పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేసినట్లు చెప్పారు. శుక్రవారం నిర్వహించిన ఈ సోదాల్లో శ్రీనివాసరావు అనే వ్యక్తి నివాసంలో 800 జిలిటెన్ స్టిక్స్, 5 వేల డెటోనేటర్లు లభించాయి.
సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాస రావు అనే వ్యక్తి ఇంటిపై అకస్మాత్తుగా దాడి చేసి, సోదాలు నిర్వహించారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని, శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. మావోయిస్టులకు చేరవేయడానికే శ్రీనివాస రావు వాటిని నిల్వ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.
పాచిపెంటకు పంపించడానికి వాటిని నిల్వచేసినట్లు శ్రీనివాస రావు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. బొబ్బిలి ప్రాంతంలో మావోయిస్టు సానుభూతిపరులు ఎక్కుగా ఉన్నారని అనుమానిస్తున్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మావోయిస్తుల కదలికలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ పేలుడు పదార్థాలను మావోయిస్టులకు చేరవేయడానికే నిల్వ చేసినట్లు కూడా అనుమానిస్తున్నారు. స్థానికులు శ్రీనివాస రావుకు అనుమానం రాకుండా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అతని ఇంటిపై దాడి చేశారు. దీంతో పెద్ద ముప్పు తప్పిందని భావిస్తున్నారు.