పిఠాపురంలో సంచలనం.. డమ్మీ ఈవీఎంలు ఎవరి కోసం?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అందుకు కారణం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడినుంచే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. జనసేనానిని ఓడించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అస్త్ర శస్త్రాలను ప్రయోగిస్తోంది. సీనియర్ నేతలను నియోజకవర్గంలో మొహరించింది. వైసీపీ ఓడిపోయినా పర్వాలేదుకానీ పవన్ కల్యాణ్ మాత్రం గెలవకూడదు అనేది ఆ పార్టీ సిద్ధాంతంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పట్టుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్
ఈ నేపథ్యంలో డమ్మీ ఈవీఎంలు కలకలం రేకెత్తించాయి. వైసీపీ ఎన్నికల ప్రచార సామగ్రిలో ఇవి ఉండటంతో అధికారులు కంగుతిన్నారు. కాకినాడ నుంచి పిఠాపురానికి వైసీపీ ఎన్నికల ప్రచార సామగ్రిని తరలిస్తుండగా పిఠాపురం బైపాస్ రోడ్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వీటిని పట్టుకున్నారు. వాటిల్లో డమ్మీ ఈవీఎంలు ఉండటంతో అధికారులు నివ్వెరపోయారు.

ఎలక్ట్రానిక్ విధానంలోనే ఈవీఎంలు
డమ్మీ అయినప్పటికీ పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలోనే ఉండటంతో వీటిని ఎక్కడకు, ఎందుకు తరలిస్తున్నారనే అంశంపై అధికారులు ఎంక్వయిరీ చేస్తున్నారు. ప్రచార సామగ్రిలో వైఎస్ జగన్ చిత్రాలతోపాటు మాస్క్ లు, టోపీలు, కండువాలు, జెండాలు, బొట్టు పెట్టుకునే స్టిక్కర్లు.. ఇలా అనేకరకాల వస్తువులు దొరికాయి. రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో వీటిని సీజ్ చేశారు. అయితే ఈవీఎంలపై మాత్రం అధికారులు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, వారు ఏ నిర్ణయం తీసుకుంటారో తమకు తెలవదని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తెలిపారు.
పిఠాపురం నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా రాజకీయ పార్టీల యంత్రాంగంతోపాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాలు ఒక ఎత్తు కాగా, పిఠాపురం నియోజకవర్గం ఒకటే మరో ఎత్తుగా నిలిచింది. అత్యంత సున్నితమైన నియోజకవర్గంగా నిలుస్తోంది.












Click it and Unblock the Notifications