టిడిపి ఫ్లెక్సీ:చిరంజీవితో బాలయ్య, మెగా ఫ్యాన్స్ ఆగ్రహం
తాజాగా నెల్లూరులో చిరు, బాలయ్యలతో కూడిన ఫ్లెక్సీ వెలువడం ఆసక్తికరంగా మారింది. నెల్లూరుకు చెందిన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత శ్రీధర కృష్ణా రెడ్డి 2009లో నాడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం విలీనం కారణంగా కాంగ్రెసు పార్టీలోకి వెళ్లారు.
ఇప్పుడు కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు మొగ్గు చూపడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీ వెలిసింది. అందులో చిరంజీవి, బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుల ఫోటో ఉంది.
చిరంజీవి ఫోటోను తెలుగుదేశం పార్టీతో, బాలకృష్ణతో కలిపి ఏర్పాటు చేయడంపై మెగాస్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇతర పార్టీలలోకి వెళ్తే వెళ్లవచ్చు కానీ చిరంజీవి ఫోటోను ఇష్టారీతిగా ఉపయోగించుకోవడం సరికాదని మండిపడ్డారు.