కృష్ణానదిలో మరో అద్భుతం: గోవాలో మాదిరి 'ఫ్లోటెల్'
విజయవాడ: రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర తాత్కాలిక రాజధానిగా సేవలందిస్తోన్న విజయవాడ ఎప్పటికప్పుడు కొత్త సొగసులు దిద్దుకుంటుంది. తాజాగా విజయవాడలోని కృష్ణానది మధ్యలో నీటిపై తేలియాడే 'ప్లోటెల్'ను ఏర్పాటు చేశారు. సాధారణంగా ఇలాంటి ఫ్లోటెల్లు గోవాలో ఎక్కువగా దర్శనమిస్తుంటాయి.
అయితే తొలిసారి విజయవాడలో ఇది ఏర్పాటు కావడం విశేషం. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ ఫ్లోటెల్ మరికొద్ది రోజుల్లో నగరవాసులకు అందుబాటులోకి రానుంది. విజయవాడలో వాటర్ స్పోర్ట్స్ పర్యాటకాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఛాంపియన్స్ యాచ క్లబ్ దీనిని ఏర్పాటు చేస్తుంది.
రాబోయే రోజుల్లో ఇలాంటివి మరో వందకు పైగా కృష్ణానది మధ్యలో ఉన్న భవానీద్వీపం చుట్టూ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ముందుగా నీటిపై తేలియాడే పెద్ద జెట్టీని ఏర్పాటు చేశారు. ఈ జెట్టీ పది టన్నుల బరువు వేసినా నీటిలో తేలియాడుతూనే ఉంటుంది.

జెట్టీని మూడు భాగాలుగా విభజించారు. జెట్టీపై వాకింగ్ చేయడానికి వీలుగా కొంత ఖాళీ స్థలం వదిలారు. ఒకవైపు కాఫీ క్లబ్ ఏర్పాటు చేశారు. మరోవైపు డబుల్ బెడ్రూమ్ సదుపాయంతో మినీ హోటల్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అందులో పార్టీషనింగ్, ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి.
అయితే ఈ ఫ్లోటెల్లో గడపాలనుకునే కస్టమర్లు ముందుగా బుక్ చేసుకోవాలి. త్వరలో ఫ్లోటెల్ పైనే మినీ రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారు. ఫాస్ట్ఫుడ్స్ వంటివి పర్యాటకులకు సిద్ధం చేయనున్నారు. పక్కనే కృష్ణానదిలో వాటర్ పార్క్ను ఏర్పాటు చేశారు.
ఈ ఫ్లోటెల్ చేరుకోవాలంటే ముందుగా హరిత బెర్మ్ పార్క్ నుంచి ఏపీటీడీసీ వారి బోట్లలో భవానీ ఐల్యాండ్ చేరుకోవాలి. ఐల్యాండ్లోని టవర్ వద్ద జెట్టీ పాయింట్ నుంచి స్పీడ్ బోట్లో కొంత దూరం ప్రయాణించాక ఫ్లోటెల్కు చేరుకోవచ్చు.












Click it and Unblock the Notifications