ప్రత్యేక హోదా రాదని తేల్చేసిన హరిబాబు: సహకరిస్తామని తెలంగాణ ఎమ్మెల్సీ
గుంటూరు/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా వల్ల వచ్చే నిధుల కంటే, రెట్టింపు నిధులు ఇచ్చేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తోందని విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు, బిజెపి నేత కంభంపాటి హరిబాబు చెప్పారు. ఈ మాటలను బట్టి ఎపికి ప్రత్యేక హోదా రాదనే విషయం తెలిసిపోతోంది. రాజధానికి ప్రణాళిక సిద్ధం కాకపోయినా, కేంద్రం వెయ్యికోట్లు మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు.
పోలవరంపై రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు, పదేళ్లు అధికారంలో ఉండి ఏంచేశారో చెప్పాలని హరిబాబు డిమాండ్ చేశారు. విభజన చట్టంలో లేని అంశాలను కూడా కేంద్రం అమలు చేస్తోందని ఆయన అన్నారు. ఏపీ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని హరిబాబు చెప్పారు. ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను భయాందోళనలకు గురి చేయడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హరిబాబు చెప్పారు.

ఇదిలావుంటే, అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటిస్తే బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మాత్రం పూటకో మాటతో ప్రజలను గందరగోళపరుస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై సోమవారం ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే సహకరిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి పాలనపైనా రంగారెడ్డి ఉస్మానియా ఆస్పత్రి హెరిటేజ్ భవనమని, దాన్ని కూల్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉస్మానియా ఆస్పత్రి మరమ్మతులకు గతంలో కాంగ్రెస్ రూ. 200 కోట్లు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ తాను ఆయోమయానికి గురవుతూ రాష్ట్ర ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications