జివోఎం ట్విస్ట్: యూటిగా హైదరాబాద్? చిరు హెచ్చరిక
తమ సూచనలను పరిగణలోకి తీసుకుంటే తాము పార్లమెంటులో సహకరించేది లేదని కేంద్రమంత్రులు జివోఎం, అధిష్టానానికి తేల్చి చెప్పారు. దీంతో జివోఎం ఒక అడుగు వెనక్కు వేసింది. ఈ నేపథ్యంలో గురువారం భేటీ అయిన జీవోఎం కేంద్రమంత్రుల సూచనలను పరిగణలోకి తీసుకుంది. తద్వారా వాటితో కీలక సవరణలు చేసినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాదును పదేళ్లపాటు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలి. తెలంగాణ బిల్లును లోకసభలోనే ప్రవేశ పెట్టాలి. 14వ ఆర్థిక సంఘం ద్వారా సీమాంధ్రకు భారీ ప్యాకేజీని ఇవ్వాలి. రెండు ప్రాంతాల ఆదాయాలను గణించిన తర్వాత ప్యాకేజీ ఎంత అనేది 14వ ఆర్థిక సంఘం గుర్తించాలి.
ఏ ప్రాంతానికి ఎంత ఆదాయం ఆర్థిక సంఘం సూచిస్తుంది. సీమాంధ్ర రాజధాని నిర్మాణ ఖర్చు కేంద్రమే భరించాలి. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. కాగా, తెలంగాణపై రేపు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. రాజ్యసభలో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రవేశ పెడతామని చెప్పినప్పటికీ లోకసభలోనే పెట్టాలని జివోఎం సూచించడం గమనార్హం. కాగా, నేటి కేబినట్ సమావేశానికి తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం లేదని గులాం నబీ ఆజాద్ చెప్పారు.
చిరంజీవి హెచ్చరిక
హైదరాబాద్ను యూటి చేయాల్సిందేనని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి మరోసారి డిమాండ్ చేశారు. దీనికి తోడు, పోలవరం ముంపు గ్రామాలు, భద్రాచలం రెవెన్యూ డివిజన్ ను సీమాంధ్రలో కలపాలన్నారు. ఒకవేళ రాష్ట్ర విభజన అనివార్యమయితే సీమాంధ్ర కేంద్ర మంత్రులం ప్రతిపాదించిన 10 డిమాండ్ లకు కేంద్రం అంగీకారం తెలపాలన్నారు. లేదంటే తాము తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని హెచ్చరించారు. హైదరాబాదును వదులుకోవడం సీమాంధ్రులకు ఇష్టం లేదన్నారు. దామాషా పద్దతిలో రెవెన్యూ పంపకాలు జరగాలన్నారు.
మరోవైపు తెలంగాణ ముసాయిదా బిల్లు పార్లమెంటు ముందుకు సోమవారం రానుంది. రేపు కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ బిల్లును ఆమోదించనున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు చేసిన సూచనల మేరకు కొన్ని సవరణలు చేసి సోమవారం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనున్నారు.