ఏపీలో గవర్నర్ మార్పు-హరిచందన్ కు స్పెషల్ వీడ్కోలు- అబ్దుల్ నజీర్ కు స్వాగతం..
కేంద్రం తాజా బదిలీల్లో చేసిన ఏపీ గవర్నర్ మార్పు అమల్లోకి రాబోతోంది. ఇందుకోసం ప్రభుత్వం అధికారికంగా ఏర్పాట్లు చేసింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా 11 రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేసింది. ఇందులో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా బదిలీ అయ్యారు. దీంతో ఆయన స్ధానంలో కొత్తగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రానికి రాబోతున్నారు.
ప్రస్తుతం గవర్నర్ గా ఉన్న విశ్వభూషణ్ తో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు అధికారికంగా ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. ఈ మేరకు రాజ్ భవన్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత గవర్నర్ హరిచందన్ కు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. వీడ్కోలు కార్యక్రమం తర్వాత హరిచందన్ ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టేందుకు వెళ్లనున్నారు.

మరోవైపు కొత్తగా గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ రేపు రాష్ట్రానికి వస్తున్నారు. సాయంత్రం ఆయనకు స్వాగత కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కొత్త గవర్నర్ గా రాజ్ భవన్ లో బాధ్యతలు చేపట్టబోతున్న అబ్దుల్ నజీర్ ను కలిసేందుకు ఇప్పటికే పలువురు అపాయింట్ మెంట్లు కూడా కోరినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త గవర్నర్ రాకను కూడా అధికారిక స్వాగతం పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అసలే ఎన్నికల ఏడాది గవర్నర్ గా ఉండబోతున్న అబ్దుల్ నజీర్ తో సత్సంబంధాలు కొనసాగించడం జగన్ సర్కార్ కు తక్షణావసరం. దీంతో ఆయన్ను తొలిరోజు నుంచే ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications