దేశంలోనే అతిపెద్ద రూ.22వేల కోట్ల విద్యుత్ ప్రాజెక్ట్.. ఏపీలో ఆ జిల్లా పంట పండుతుంది!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి .తాజాగా అనంతపురం జిల్లాలో భారీ విద్యుత్ ప్రాజెక్టు రాబోతుందని ఏపీ ప్రభుత్వం చెప్పడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిని స్పష్టం చేస్తుంది. గుత్తి మండలం బేతపల్లి లో 22 వేల కోట్ల రూపాయలతో రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ భారీ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతుంది.
ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ప్రోత్సాహకాలు
ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక విద్యుత్ కాంప్లెక్స్ అవుతుందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. రేపు మంత్రి లోకేష్ ఈ భారీ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ భారీ విద్యుత్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా అనేక ప్రోత్సాహకాలను ఇచ్చి ప్రభుత్వం అండగా నిలవనుంది.

ఆరేళ్ళ తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టనున్న రెన్యూ
గతంలో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో మంత్రి లోకేష్ రెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో, ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక విద్యుత్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది. దాదాపు ఆరు సంవత్సరాల తరువాత ఈ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయింది.
భారీ విద్యుత్ ప్రాజెక్ట్ ప్లాన్ ఇలా
ఈ భారీ విద్యుత్ ప్రాజెక్టులో భాగంగా మొదటి 587 మెగావాట్ల సౌర విద్యుత్, అలాగే 250 మెగావాట్ల పవన విద్యుత్, 400 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లను ఏర్పాటు చేసి ఆ తర్వాత వీటిని అప్గ్రేడ్ చేస్తారు. ప్రస్తుతం వీటి కోసం 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడిని పెట్టాలని నిర్ణయించారు. ఉన్నతీకరణ లో భాగంగా 1800 మెగావాట్ల సౌర విద్యుత్తు, 1000 మెగావాట్ల పవన విద్యుత్, 2000 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ కి దీనిని పెంచుతారు.
వైసీపీ ప్రభుత్వం చేసిన పనితో ఆలస్యంగా విద్యుత్ ప్రాజెక్ట్
గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో రెన్యూ సంస్థ 777 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల కోసం చంద్రబాబు సర్కారుతో ఒప్పందం చేసుకుంది. కానీ వైసీపీ ప్రభుత్వం పి పి ఏ లను రద్దు చేయడంతో ఆ ప్రాజెక్టు ఏర్పాటు కాలేదు. ఇప్పుడు బేతపల్లి లో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించింది.
బేతపల్లిలో విద్యుత్ ప్రాజెక్ట్ కు రైతుల నుండి భూములు
రాబోయే ఐదు సంవత్సరాలలో 72,000 మెగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సర్కార్ ఈ భారీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పైన దృష్టి సారించింది. ఈ క్రమంలోని బేతపల్లి లో రైతుల నుంచి ఎకరాకి ఏడాదికి 31 వేల రూపాయల లీజు చొప్పున భూములను తీసుకున్నారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఐదు శాతం లీజు పెంచేలా ఒప్పందం చేసుకున్నారు ఈ విద్యుత్ ప్రాజెక్టుతో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications