రాజీనామా, కొత్తపార్టీ: కిరణ్ కదలికలపై అధిష్టానం కన్ను
హైదరాబాద్/న్యూఢిల్లీ: 2014 ఎన్నికలలోపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న కాంగ్రెసు పార్టీ అధిష్టానం.. విభజనను అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కదలికల పైన కన్నేసిందట. కిరణ్ శాసన సభలో ఓట్ ఆన్ అకౌంట్ ప్రతిపాదించిన తరువాత ఏ క్షణమైనా పదవి నుంచి తప్పుకోవచ్చని అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది.
యూపిఏ సంకీర్ణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించే సమయానికి పదవిలో కొనసాగకూడదని కిరణ్ యోచిస్తున్నట్టు ఢిల్లీ పెద్దలు అంచనా వేస్తున్నారు. శాసన సభలో తెలంగాణ బిల్లుపై ప్రసగించే సమయంలో కిరణ్ కాంగ్రెసు పార్టీని టార్గెట్ చేసుకునే అవకాశాలు లేకపోలేదు.
సమావేశాలను మరికొద్ది రోజులు పొడిగించి ఓట్ ఆన్ అకౌంట్కు ఆమోదం పొందిన తరువాత, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటంతోపాటు సొంత పార్టీ ఏర్పాటు చేసుకునే అవకాశాలు లేకపోలేదన్నదని అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది.

విభజన అంశంపై అసెంబ్లీలో మరింత చర్చ జరిపేందుకు మరికొంత గడువు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాయటం ద్వారా బిల్లు పార్లమెంటు పరిశీలనకు రాకుండా అడ్డుకోవాలన్న కిరణ్ ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించవంటున్నారు. కిరణ్ గడువు కోరినా రాష్టప్రతి పొడిగించక పోవచ్చునంటున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో శాసనసభకు ఇచ్చిన గడువును రాష్టప్రతి పెంచినా వారానికి మించదంటున్నారు.
రాష్టప్రతి ఇచ్చిన గడువు ప్రకారం 23 వరకు బిల్లుపై అసెంబ్లీలో చర్చించి, తరువాత మూడు రోజుల్లో చర్చకు సంబంధించిన నోట్ను సిద్ధం చేసి పంపించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి అదనంగా మరో వారం పాటు సమయం ఇచ్చినా జనవరి నెలాఖరుకు ముసాయిదాను వెనక్కి పంపించక తప్పదు. గడువు పెంచినా, పెంచకున్నా ఫిబ్రవరి మొదటిపక్షంలో ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల మలివిడత సమావేశాల్లో బిల్లును ప్రతిపాదించి తీరుతామని కేంద్రం చెప్పినట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కిరణ్ ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో పదవి నుంచి తప్పుకుని సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి వెళ్లినా ఆశ్చర్యపోయేది లేదని అధిష్టానం అంచనా వేస్తోంది. 23వ తేదీ తర్వాత అందరం భేటీ అవుదామని ఇప్పటికే కిరణ్ సీమాంధ్ర నేతలకు చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications