కెసిఆర్ ఫిక్స్: జిహెచ్ఎంసి ఎన్నికలకు హైకోర్టు గడువు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావును హైకోర్టు ఫిక్స్ చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టు డెడ్లైన్ విధించింది. ఆరు నెలల్లోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఫోరమ్ఫర్గుడ్గవర్నెన్స్ పద్మనాభరెడ్డి వేసిన పిటిషన్ ఆధారంగా విచారణ జరిపిన కోర్టు సోమవారం ఉదయం ఈ మేరకు తీర్పును వెలువరించింది. అక్టోబర్ 31లోగా వార్డుల విభజన రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్ 16నాటికి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఆరు నెలలకు మించి గడువు కావాలని ప్రభుత్వం తరపున లాయర్ కోర్టును కోరారు. ఇప్పటికే ప్రత్యేకాధికారుల పాలన ఉన్నందున అదనపు సమయం ఇవ్వలేమని స్పష్టం చేసింది. 225 రోజుల గడువు ఇస్తున్నామని ఆలోపు ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కి తగిన బలం లేకపోవడంతో జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణలో కెసిఆర్ జాప్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, రంగా రెడ్డి జిల్లాల్లోని తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల శాసనసభ్యులను, నాయకులను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా జిహెచ్ఎంసి ఎన్నికల్లో సత్తా చాటాలనే వ్యూహంతో ఆయన అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లో చేరారు.