చవాన్ పాత్ర పోషిస్తా: సీమాంధ్ర పెట్టుబడులపై జైపాల్రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సీమాంధ్రుల పెట్టుబడులు కాదనలేమని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఆదివారం అన్నారు. మాతృభాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కవి వకుళాభరణం జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో రూపొందించిన జననీ తెలంగాణ ఆడియో సిడిని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మహారాష్ట్ర విడిపోయినప్పుడు కీలకంగా వ్యవహరించిన యశ్వంత రావు చవాన్ పాత్రను తాను ప్రస్తుతం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో పోషిస్తానన్నారు.
సామాజిక తెలంగాణ నిర్ణాం అవసరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర ఎంతో ఉందని, పాటల ద్వారా భావాన్ని రగిలించి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని సూచించారు. మహారాష్ట్ర విడిపోయిన సమయంలో గుజరాతీయులకు ఉన్న అపోహలను తొలగించి ఘర్షణలు లేకుండా చేయడంతోనే విభజన ప్రక్రియ ఫలప్రదమైందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోపాటు ఈ ప్రాంత ప్రజానీకం భవిష్యత్తు బాగుండాలని, అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమైనప్పుడే అసలు ఆశయం సిద్దిస్తుందన్నారు. రాజకీయాలు అసంపూర్ణ రామాయణమని, అందులో పాత్రలు వస్తుంటాయి, పోతుంటాయని తెలిపారు. హైదరాబాదు అభివృద్ధిలో నిజాం నవాబుల పాలనే కాకుండా చరిత్రకారులు, మేథావులు, కన్నడిగులు, మార్వాడీలు ఇలా ప్రతి ఒక్కరు ఉన్నారన్నారు.
హైదరాబాద్కు అందరినీ ఆదరించే సంప్రదాయం, సంస్కృతి ఉందన్నారు. సీమాంధ్రులు ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దన్నారు. విభజన సమయంలో భేషజాలకు తావులేకుండా శాంతిచర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చునని జైపాల్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications