జనసేన సైనికురాలా..: మనదేవర సభకు వస్తున్నానంటూ బండ్ల గణేష్ ట్వీట్
అమరావతి: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అభిమాని.. కాదు పరమ భక్తుడు నిర్మాత బండ్ల గణేష్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ని దేవుడిలా కొలిచే బండ్ల గణేష్కు పవన్ ఫ్యాన్స్లో మంచి క్రేజ్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్లో బండ్లన్న ఇచ్చే మాస్ స్పీచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు.
పవన్ కళ్యాణ్పై ప్రశంసల వర్షం కురిపించే బండ్ల స్పీచ్ వినడానికి కూడా పవన్ అభిమానులు హాజరవుతుంటారు. ఇక ఇటీవల భీమ్లా నాయక్ ఫంక్షన్కి బండ్ల గణేష్ రాలేదన్న సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్లో బండ్ల గణేష్ మాస్ స్పీచ్ని మిస్ అయ్యినట్లు చాలామంది అభిమానులు నిరాశచెందారు. అయితే.. భీమ్లా ఈవెంట్ మిస్ అయినా.. జనసేన పార్టీ మీటింగ్ లో మాట్లాడుకుందాం అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేయడం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
మార్చి 14న పవన్ తన పార్టీ జనసేన ఆవిర్భావ దినోత్సవ భారీ మీటింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మీటింగ్ కి బండ్ల గణేష్ హాజరవనున్నాడు. ఈ విషయాన్నీ బండ్ల ట్వీట్ చేస్తూ.. 'వీరులారా ధీరులారా,జన సేన సైనికులారా !! రండి కదలి రండి కడలి అలగా తరలి రండి. నేను కూడా వస్తున్నాను. మన దేవర నిజాయతీకి సాక్షిగా నిలబడడం కోసం, తెలుగు వాణి వాడి వేడి నాడి వినిపించడం కోసం, అమరావతి నించి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం. కలిసి పోరాడదాం' అంటూ చెప్పుకొచ్చారు.
అయితే, ఈ సభలో బండ్ల గణేష్ ప్రసంంగం ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుందనేది ఇప్పుడు పవన్ అభిమానులు ఆసక్తిగా మారింది. కాగా, సోమవారం సాయంత్రం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఇప్పటికే సభ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. సభకు తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున తరలిరానున్నారు.