టిడిపి వాళ్లు వెళ్లినా ఇబ్బంది లేదు: జగన్కు కోర్టు కాపీ చూపిన రోజా
హైదరాబాద్: హైకోర్టు తీర్పును ధిక్కరిస్తూ అధికార పార్టీ వాళ్లు మాట్లాడితే దానిని న్యాయస్థానం చూసుకుంటుందని, తాను రేపటి నుంచి అసెంబ్లీలో అడుగుపెడతానని వైసిపి ఎమ్మెల్యే రోజా గురువారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చెప్పారు.
రూల్ 340 సబ్ రూల్ 2 ప్రకారం తనను ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని కోర్టులో సవాల్ చేశానని చెప్పారు. తన హక్కులకు భంగం కలగకుండా హైకోర్టు తనకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు. న్యాయవ్యవస్థ పైన తనకు ఉన్న గౌరవం దీంతో రెట్టింపు అయిందన్నారు.
హైకోర్టు తీర్పును తాను అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు ఇచ్చానని చెప్పారు. ఇప్పటికైనా తనను మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తారని తాను ఆశిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం అప్పీల్ చేసుకున్నప్పటికీ.. తాము పోరాడుతామన్నారు. న్యాయస్థానం పైన తమకు నమ్మకం ఉందని చెప్పారు.
సస్పెన్షన్ తన హక్కులకు భంగమనే ఉద్దేశ్యంతోనే తాను కోర్టును ఆశ్రయించానని చెప్పారు. హైకోర్టు తీర్పును వక్రీకరించి అధికార పార్టీ నేతలు మాట్లాడితే.. కోర్టే చర్యలు తీసుకుంటుందన్నారు. గతంలో జగన్ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు.. సోనియా కాళ్ల వద్ద పడి బెయిల్ తెచ్చుకున్నట్లు చెప్పారన్నారు.
గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయవ్యవస్థను కించపర్చినట్లు మాట్లాడారన్నారు. సోనియా కాళ్ల వద్ద పడి జగన్ బెయిల్ తెచ్చుకున్నారని చెప్పారని, ఇప్పుడు తన కోర్టు తీర్పు పైన కూడా టిడిపి సభ్యులు అలాగే మాట్లాడుతున్నారు. వారు కోర్టు తీర్పును అవమానించేలా మాట్లాడుతున్నారన్నారు.
మేం చట్టం, న్యాయాన్ని నమ్ముకున్నామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. తమకు న్యాయస్థానాల పైన నమ్మకం ఉందని చెప్పారు. నిబంధనలను, ప్రజాస్వామ్యాన్ని అందరూ గౌరవించాలన్నారు. సభను హుందాగా నడపాలని చెప్పారు.
జగన్ను కలిసిన రోజా
రోజా గురువారం సాయంత్రం లోటస్ పాండులో వైసిపి అధినేత జగన్ను కలిశారు. సస్పెన్షన్ పైన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీనీ ఆయనకు చూపించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తాను మర్యాదపూర్వనకంగా కలిశానని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలకు థ్యాంక్స్ చెప్పారు. ప్రభుత్వం అఫ్పీల్కు వెళ్లినా మాకు ఇబ్బంది లేదన్నారు.