సీఎం నివాసం వద్ద ఉద్రిక్తత: పెట్రోల్ బాటిళ్లతో వందమంది ధర్నా, ఆత్మహత్యకు యత్నం
అమరావతి: ఉండవల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్ద గురువారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వందమందికిపైగా విజయవాడలోని ఇబ్రహీంపట్నం వాసులు కిరోసిన్, పెట్రోలు బాటిళ్లు వెంటతెచ్చుకుని ధర్నాకు దిగారు.
రోడ్డు విస్తరణ కోసం తమ ఇళ్లను కూలదోసి, నష్ట పరిహారం చెల్లించకుండా మూడేళ్ల నుంచి తప్పించుకున్నారంటూ ఆరపించారు. కాగా, ఇక్కడికి వచ్చిన ఓ యువకుడు పెట్రోలు పోసుకుని తగలబెట్టుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతడ్ని అడ్డుకున్నారు.

ఆ తర్వాత మిగితా వారివద్ద ఉన్న పెట్రోలు బాటిళ్లను కూడా భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. తమ ఆవేదనను చెప్పుకునేందుకు వస్తే.. ముఖ్యమంత్రి తమకు సమయం ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు.
పది రోజుల్లోనే నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినా.. మూడేళ్లయినా తమకు పరిహారం అందలేదని ఇబ్రహీంపట్నం వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడ్నుంచి కదలబోమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications