ఏపీ రాజధాని ఎక్కడో చెబితే.. మా కార్యాలయం పెడతాం: ఆర్బీఐ అధికారి లేఖ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసింతే. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూడు రాజధానులని ప్రకటన చేసింది. విశాఖపట్నం, అమరావతి, కర్నూలు రాజధానులుగా చేయాలని నిర్ణయించింది. అయితే, ఇటీవల మూడు రాజధానుల బిల్లును విరమించుకుంది. మళ్లీ నూతన బిల్లును అసెంబ్లీ ప్రవేశపెడతామని తెలిపింది.
ఈ క్రమంలో తమ రాజధాని ఏదో తెలియక రాష్ట్ర ప్రజలే కాదు.. ప్రభుత్వ వ్యవస్థలు కూడా తేల్చుకోలేకపోతున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాసిన లేఖ.. రాజధాని సమస్యను మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాక తమ కార్యాలయం ఏర్పాటు చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కార్యాలయం ఏర్పాటు చేయాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి వీరాంజనేయులు ఆర్బీఐకి ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆర్బీఐ డిప్యూటీ మేనేజర్ సుభాశ్రీ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
'రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడో ఫైనలైజ్ చేస్తే అక్కడ ఆర్బిఐ సంస్థను నెలకొల్పుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 104 కరెన్సీ చెస్ట్లు(సీసీ) పనిచేస్తున్నాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగే రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ, రాష్ట్ర స్థాయి భద్రతా కమిటీ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెన్సీ నోట్ల కొరత గురించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. అధికార యంత్రాంగం, పోలీసు వ్యవస్థతో సమన్వయంతో ఏపీలో సమర్థవంతంగా కరెన్సీ నిర్వహణ చేస్తున్నాం' అని సుభాశ్రీ వివరించారు.