''నల్లారి'' ఓకే?.. ముఖ్యమంత్రి జగన్కు మైనస్సా? ప్లస్సా?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించమని ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ సైతం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డికి సూచించారు. ఆ సమయంలో ఆ ప్రతిపాదనను నల్లారి నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పార్టీ నేతల నుంచి ఒత్తిడి వస్తుండటంతోపాటు తన కుమారుణ్ని కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలని భావిస్తున్న కిరణ్కుమార్ రెడ్డి అందుకు సూచనప్రాయంగా అంగీకారం తెలిసినట్లు సమాచారం.
కిలికిరి పర్యటనలో కిరణ్కుమార్రెడ్డి
కిలికిరి పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆయన తన వెంట వచ్చిన కుమారుడు నిఖిలేష్కుమార్రెడ్డిని పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. త్వరలోనే మళ్లీ వస్తానని, అందరినీ కలుస్తానని, అప్పుడు వివరంగా మాట్లాడుకుందామని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఉత్సాహంలో మునిగిపోయాయి. నల్లారి తన స్వగ్రామం నగరిపల్లెలో కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతాయా?
కిరణ్కుమార్రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తే పార్టీలో కొత్త ఉత్సాహం రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లారని, ఇప్పుడు కిరణ్కుమార్రెడ్డి పదవి స్వీకరించిన తర్వాత తనకున్న పరిచయాలతో కొందరు నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురాగల సామర్థ్యం ఉందని భావిస్తున్నారు. ఒకరకంగా ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉందని సీనియర్ రాజకీయ వేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు.
ప్రభావం చూపనున్న ఓట్ల చీలిక?
తెలుగుదేశం పార్టీ ఒకవైపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు, జనసేన-బీజేపీ ఇంకోవైపు పోటీచేస్తుండగా, తాజాగా కాస్తంత బలం పుంజుకొని కిరణ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ బరిలోకి దిగితే ఓట్ల చీలిక అధికార పార్టీపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుందని, అయితే ఇప్పుడే దీన్ని అంచనా వేయలేమని, కిరణ్కుమార్ రెడ్డి బరిలోకి దిగిన తర్వాత ఆ పార్టీలోకి కొనసాగే వలసలు, ప్రజల నుంచి వస్తున్న స్పందనను బట్టి ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుందంటున్నారు. ఏదేమైనా ఈ విషయంలో స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పేలా లేదు.!!