జగన్పై దాడి వ్యవహారం గురించి...సిఎం చంద్రబాబు ఇలా...ప్రత్యక్ష సాక్షి అలా!
అమరావతి:జగన్పై దాడి తర్వాత పరిణామాలను ఎదుర్కోవడంలో పోలీసులు విఫలమయ్యారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మధ్యాహ్నం 12.30 కి ఘటన జరిగితే సాయంత్రం 4 గంటల వరకూ ఏమీ చేయలేకపోయామని పోలీసు ఉన్నతాధికారులతో సిఎం అసహనం వ్యక్తం చేశారని సమాచారం.
విపక్షాల ఆందోళన ఎక్కువయ్యాక మనం స్పందించామని...అది కూడా తాను పట్టించుకోవడం వల్ల శాంతిభద్రతలు అదుపు తప్పలేదని...లేకుంటే తానూ,డిజిపి దోషులుగా నిలవాల్సి వచ్చేదని పోలీసు ఉన్నతాధికారులపై సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మరోవైపు జగన్ పై దాడి జరిగిన తీరు గురించి ఘటన జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షి కళ్లకు కట్టినట్లు వివరించారు.
Recommended Video

జగన్ పై యువకుడి దాడి, తదనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన దాడి అనంతరం పోలీసులు స్పందించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ఘటన జరిగిన వెంటనే పోలీసులు జాగ్రత్త పడలేకపోయేసరికి వాళ్ళు ప్రజలని తప్పుదోవ పట్టించారని చంద్రబాబు వ్యాఖ్యానించారట.

సిఎం పోలీసు అధికారులతో మాట్లాడుతూ..."ఈ ప్రభుత్వం నాది...ఎక్కడ విఫలమైనా చెడ్డ పేరు వచ్చేది ప్రభుత్వానికే. నేను ఇప్పుడు పడుతున్న కష్టాలు ఎప్పుడూ పడలేదు. నిన్న నేను పట్టించుకోకపోతే శాంతిభద్రతలు అదుపు తప్పేవి. నేనూ, డీజీపీ దోషులుగా నిలబడాల్సి వచ్చేది"...అని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో శాంతిభద్రతల సాకుతో రాష్ట్రపతి పాలన పెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారని సమాచారం.
అంతకుముందు జగన్ పై దాడి గురించి ఆ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా భావిస్తున్న కరణం ధర్మశ్రీ వివరాలు వెల్లడించారు. "అప్పుడు సమయం సుమారు మధ్యాహ్నం 12.40 గంటలు అయి ఉంటుంది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో జరుగుతున్న అవకతవకలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి జగన్ ని నేను అనుమతి అడుగుతున్నాను. ఇంతలో జగన్ తాగిన కాఫీ గ్లాసు తీయడానికా అన్నట్టుగా ఒక యువకుడు అక్కడకు వచ్చాడు.
సార్... తొమ్మిది సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. మీతో ఒక్క సెల్ఫీ తీసుకుంటాను అని అతడు జగన్ ను అడిగాడు. జగన్ సెల్ఫీకి సిద్ధం అవుతున్న సమయంలో ఒక్కసారిగా కత్తితో మెడపై పొడిచేందుకు యత్నించాడు. జగన్ అది గమనించి వెనక్కి జరిగారు. కత్తి భుజంపై దిగింది. మరోసారి కూడా పొడిచేందుకు యత్నించేలోగా అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ సీఐ అతడిని పట్టుకుని పక్కకు లాగారు.
ఈ సందర్భంగా ఆ యువకుడు "నన్ను అరెస్టు చేసుకోండి...నన్ను అరెస్టు చేసినా ఫరవాలేదు" అంటూ ఏవేవో అరుస్తూ కేకలు వేసినట్లుగా మాట్లాడాడు. పొడిచిన కత్తికి పాయిజన్ ఉంటుందేమోనన్న అనుమానంతో విమానాశ్రయంలోనే జగన్ కు ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు. జగన్పై దాడి జరిగిన తీరు చూస్తే ఖచ్చితంగా కావాలని ప్రణాళిక ప్రకారం దాడి చేసినట్టు కనపడుతుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడుతున్నది. విమానాశ్రయంలోకి కత్తిని ఎలా అనుమతించారో తెలియడంలేదు!''...అని కరణం ధర్మశ్రీ విరించారు.


Click it and Unblock the Notifications