ఏపిలో ఆ సామాజిక వర్గం ఎవరికి జై కొడతారు...?
ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు తారా స్థాయిలో నడుస్తున్నాయి. కాపు రిజర్వేషన్ల అంశంపట్ల వేడెక్కిన ఏపి రాజకీయం వివిధ సామాజిక వర్గాలను మచ్చికచేసుకోవాలని చూస్తున్నాయి రాజకీయ పార్టీలు. రాష్ట్రంలో గల అన్నీ నియోజకవర్గాలలో దాదాపుగా ఏదొక సామాజిక వర్గం మీదనే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఒక నియోజక వర్గంలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం చెలాయిస్తే, మరో చోట రెడ్డి సామాజిక వర్గం డామినేట్ చేస్తుంది. అలా దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలోనే కులాల మీద రాజకీయాలు నడుస్తాయి. దానికి తోడు నాయకులు కూడా ఆయా కులాలకు తగ్గట్టుగా హామీలు ఇచ్చి వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. 2014లో అదికార తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దత్తు తెలిపిన ఆ సామాజిక వర్గం 2019లో ఎవరికి అండగా నిలబడబోతోంది.. ? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
ఏపీ రాజకీయాల్లో క్షత్రియులదే కీలక పాత్ర..!!
మరో పది నెలల్లో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపి లోని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. 2014లో తమ పార్టీకి మద్ధతు తెలిపిన క్షత్రియ వర్గంపైనా టీడీపీ దృష్టి సారించింది. 2019 ఎన్నికల్లో కూడా వారిని తమ వైపుకి తిప్పుకునేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఈ క్రమంలోనే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఎక్కువగా ఉన్న క్షత్రియులు ఎవరికి జై కొడతారు? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలని తిరిగి నిలుపుకుని, మిగతా చోట్ల ప్రతిపక్ష పార్టీకి ధీటైన అభ్యర్ధులని బరిలో నిలపాలని అదికార పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.
క్షత్రుయులు ఏ పార్టీని వరిస్తే ఆ పార్టీ గెలుపు ఖాయం..
ఏపిలో క్షత్రియుల ప్రాధాన్యం ఉన్న 34 నియోజకవర్గాల్లో 29 చోట్ల టీడీపీ విజయఢంకా మోగించడం గమనార్హం. రాష్ట్రంలో క్షత్రియుల ఓటు బ్యాంకు భారీగా ఉన్న నియోజకవర్గాలను పరిశీలిస్తే.. ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, కాకినాడ, రాజోలు, రాజమండ్రి, గజపతి నగరం, నెల్లిమర్ల, ప్రత్తిపాడు, విజయనగరం, భీమిలి, విశాఖ నార్త్, తుని, చోడవరం, ఉండి, అత్తిలి, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, కైకలూరు, రామచంద్ర పురం, ఉంగుటూరు, ఆచంట, చీపురుపల్లి, పిఠాపురం, యలమంచలి, విశాఖ ఈస్ట్, కైకలూరు, బాపట్ల, రాయచోటి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, నగరి. ఈ మొత్తం నియోజకవర్గాల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 29 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక తుని, రాయచోటి, ఆత్మకూరు, నగరి, బాపట్లలో మాత్రం వైసీపీ సత్తా చాటుకుంది.
సిట్టింగులను కొనసాగించే యోచనలో బాబు..
2019 సాధారణ ఎన్నికల్లో మరోసారి ఇవే స్థానాలను కైవసం చేసుకోవాలని టీడీపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఈ నియోజకవర్గాల్లో క్షత్రియ వర్గానికే చెందిన నేతలనీ పోటీకి దింపాలని భావిస్తోంది. ముఖ్యంగా ఈ సామాజిక వర్గంలో మంచి పేరున్న సీనియర్ టీడీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుని ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయించే ఆలోచనలో ఉంది. ఆయన కూడా ఇందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అలాగే ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న కలువపూడి శివ(ఉండి), కేఎస్ఎన్.రాజు(చోడవరం), దాట్ల సుబ్బరాజు(ముమ్మడివరం), - ఎస్విఎస్ఎన్ వర్మ(పిఠాపురం) లకు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్లను ఖరారు చేసే యోచనలో ఉంది అదికార పార్టీ.
ఆదిక్యం నిలుపుకోవాలి.. ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టాలి.. అదే టీడిపి టార్గెట్..
ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే క్షత్రియ క్యాండెట్ల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల టీడీపీలోకి వచ్చిన కనుమూరి రఘురామకృష్ణంరాజుకు నరసాపురం ఎంపీగా టికెట్ ఖరారైంది. అదేవిధంగా గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ స్థానాన్ని ఆ పార్టీ నేత వేగేశన నరేంద్రవర్మకు ఇస్తారన్న టాక్ జిల్లాలో బలంగా వినిపిస్తోంది. బాపట్ల సీటు నుంచి 1999లో టీడీపీ నుంచి ఇదే సామాజికవర్గానికి చెందిన అనంత వర్మ గెలిచారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు కాంగ్రెస్, 2014 లో వైసీపీ గెలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా బాపట్ల సీటుని కైవసం చేసుకోవాలని తెలుగు తమ్ముళ్లు వ్యూహం రచిస్తున్నారు. వీటితో పాటు పాటు రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ క్షత్రియ సామాజికవర్గాన్ని తమ వైపే తిప్పుకోవాలని టీడీపీ పావులు కదుపుతోంది. కాగా ప్రస్తుతం టీడిపి ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత, వైఎస్ జగన్ పాదయాత్ర ప్రభావం టీడీపీ ఓటు బ్యాంకుని ఏ మేర ప్రభావితం చేస్తుందో చూడాలి.