ఏపీని గట్టిగా దెబ్బ కొట్టిన ఎల్ నినో..: చంద్రబాబు యాక్షన్ ప్లాన్
ఏపీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాకాల సీజన్ లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో కరవు ఛాయలు సైతం అలముకొంటోన్నాయి. క్రమంగా మంచినీటి ఎద్దడీ తలెత్తుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ కు వరద జలాలు వస్తోన్నప్పటికీ.. అవన్నీ కూడా ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన అతి భారీ వర్షాల వల్లే. ఏపీలో మాత్రం వర్షాలు ఆశించిన స్థాయిలో పడట్లేదు.
ఈ నేపథ్యంలో ప్రజలకు ఎక్కడా మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయం ఆర్టీజీఎస్ ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎల్ నినో ప్రభావం కారణంగా తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. జలాశయాలు, వివిధ నీటి వనరుల్లో ప్రస్తుత లభ్యతను నిరంతరం అంచనా వేస్తూ తాగునీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా బేసిన్లోకి వస్తున్న వరద నీటిని గరిష్టంగా సద్వినియోగం చేసుకునేలా నీటి నిర్వహణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కృష్ణా, గోదావరిల్లో వరద ప్రవాహ పరిస్థితి, రిజర్వాయర్ల వారీగా నిల్వ ఉన్న నీటి మట్టాల గురించి ఆరా తీశారు. తాజా వరద జలాల గురించి తక్కువ వర్షపాతం కారణంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదం ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
పశువులకు మేత కొరత రాకుండా ముందస్తుగా అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా చేసే తాగునీటి నాణ్యతను పరీక్షించి, ల్యాబ్ టెస్టుల నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అలాగే, ఆంగన్ వాడి కేంద్రాలను అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలను నిర్వహించాలని, నీటి కాలుష్యం బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అనంతరం రవాణా శాఖపై సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. పాత నిబంధనలను తక్షణమే రద్దు చేయాలని, రవాణా శాఖ సేవల్లో ఆధునిక సాంకేతికతను వంద శాతం వినియోగించడం ద్వారా లంచాలకు తావు లేకుండా చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. నిబంధనలను సరళీకృతం చేయడం ద్వారా వాహనదారులకు వేగవంతమైన, సులభతరమైన సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు.
రవాణా శాఖలో త్వరలో ప్రవేశపెట్టనున్న పలు సంస్కరణలను అధికారులు ఈ సందర్భంగా చంద్రబాబుకు వివరించారు. 24 గంటల్లోనే డీమ్డ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసే నూతన విధానాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సుల పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వీటితో పాటు ఫారం-5బీ వంటి పరీక్ష విధానాలను తొలగించడం ద్వారా కార్యాలయాల్లో జాప్యాన్ని అరికట్టవచ్చని చెప్పారు.












Click it and Unblock the Notifications