సరోజమ్మకు జగన్ ఛాన్స్:జెసికి షాక్, 3పై టిడిపి డైలమా
బుధవారం కడప జిల్లా పులివెందులలోని పార్టీ కార్యాలయంలో తాడిపత్రి టిడిపి ఇంఛార్జి పేరం నాగి రెడ్డి తన అనుచరులతో జగన్ను కలిశారు. దాదాపు ఇరవై నిమిషాలు వారి మధ్య చర్చ జరిగింది. అనంతరం నాగి రెడ్డికి జగన్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరం కోడలు సరోజమ్మ తమ పార్టీ తరఫున పోటీ చేస్తారని చెప్పారు. ఆమెను గెలిపించే బాధ్యతను పేరం నాగిరెడ్డికి అప్పగించినట్లు తెలిపారు.
పేరం నాగిరెడ్డి తాడిపత్రి టిడిపి ఇంఛార్జిగా ఉన్నారు. కొంతకాలంగా జెసి సోదరులు టిడిపిలోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో పేరం టిడిపిని వీడి జగన్ పార్టీలో చేరినట్లు చెబుతున్నారు. మరోవైపు జెసి సోదరులు కొంతకాలంగా టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్నారు. రెండు రోజుల క్రితం జెసి మాటలను చూస్తే ఆయన జగన్ వైపు వెళ్తారని భావించారు.
ఇప్పుడు పేరం జగన్ పార్టీలోకి వెళ్లడంతో జెసి సోదరులకు తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం అంటున్నారు. జెసి ప్రభాకర్ రెడ్డికి అనంతపురం లోకసభ టిక్కెట్, జెసి దివాకర్ రెడ్డి తనయుడికి తాడిపత్రి అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈ టిక్కెట్ల పైన జెసి సోదరులు టిడిపి నేతలతో చర్చలు జరుపుతున్నారట.
జిల్లా నుండి ముగ్గురా?
జెసి సోదరులు టిడిపిలోకి వచ్చి అనంత లోకసభ, తాడిపత్రి అసెంబ్లీ టిక్కెట్లు అడిగితే ఆ కుటుంబం నుండి అనంతపురం జిల్లాలో ముగ్గురు బరిలోకి దిగినట్లవుతుంది. ఇప్పటికే జెసి అల్లుడు దీపక్ రెడ్డి అనంతపురంలో ఓ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జిగా ఉన్నారు. గత ఉప ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. జెసి రాకను వ్యతిరేకిస్తున్న టిడిపి వర్గాలు ఒకే కుటుంబం నుండి ముగ్గురికి టిక్కెట్లు ఇవ్వడానికి ససేమీరా అనవచ్చు.